సచిన్, వార్న్‌ల ఆధ్వర్యంలో టి20 లీగ్!

16 May, 2015 02:37 IST|Sakshi
సచిన్, వార్న్‌ల ఆధ్వర్యంలో టి20 లీగ్!

సిడ్నీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కలిసి ఓ సరికొత్త టి20 లీగ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇం దులో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆటగాళ్లే ఆడనున్నారు. ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక కథనం ప్రకారం.. క్రికెట్ ఆల్ స్టార్స్ లీగ్ పేరిట సచిన్, వార్న్ కలిసి 28 మంది ప్రముఖ మాజీలకు మ్యాచ్‌కు 25 వేల డాలర్ల చొప్పున ఆఫర్ చేశారు. 42 నెలల కాలంలో 15 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఆసీస్ నుంచి బ్రెట్ లీ, పాంటింగ్, గిల్‌క్రిస్ట్, మెక్‌గ్రాత్, ఇంగ్లండ్ నుంచి మైకేల్ వాన్, ఫ్లింటాఫ్, దక్షిణాఫ్రికా నుంచి కలిస్‌ను లీగ్ కోసం సంప్రదించినట్టు పేర్కొంది. ‘వార్న్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నప్పటికీ ఈ ఆలోచనకు పూర్తిగా మద్దతిస్తున్నాడు. ఈ ఏడాదే తను, సచిన్ కలిసి లీగ్‌ను ప్రారంభిస్తున్నట్టు సమాచారమిచ్చాడు’ అని ఆ పత్రిక పేర్కొంది.

మరోవైపు ఈ ఆఫర్‌ను లీ మేనేజర్ మ్యాక్స్‌వెల్ ధృవీకరించాడు. అంగీకారం కోసం క్రికెట్ ఆస్ట్రేలియాను సంప్రదించామని పేర్కొన్నారు. మూడున్నరేళ్ల పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో లీగ్ జరుగుతుందని, సెప్టెంబర్‌లో జరుగబోయే ప్రారంభ లీగ్ అమెరికాలోని న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, షికాగోలలో నిర్వహిస్తారని పత్రిక కథనం.

మరిన్ని వార్తలు