క్వార్టర్స్‌లో సాకేత్, యూకీ

14 May, 2015 02:26 IST|Sakshi

సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్) : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేనితోపాటు భారత అగ్రశ్రేణి ఆట గాడు యూకీ బాంబ్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సాకేత్ మైనేని 6-3, 6-2తో ల్యూక్ బామ్‌బ్రిడ్జి (బ్రిటన్)పై అలవోకగా గెలుపొందగా... ఏడో సీడ్ యూకీ 1-6, 7-5, 7-6 (7/1)తో లాస్లో జెరె (సెర్బియా)పై చెమటోడ్చి విజయం సాధించాడు.

తొలి రౌండ్‌లో రెండో సీడ్ ఫారూఖ్ దస్తోవ్ (ఉజ్బెకిస్తాన్)పై సంచలన విజయం సాధించిన ల్యూక్ రెండో రౌండ్‌లో సాకేత్ ముందు తేలిపోయాడు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.  డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ -దివిజ్ (భారత్) జోడీ 4-6, 6-7 (4/7)తో లాస్లో జెరె-పెజా (సెర్బియా) జంట చేతిలో ఓడింది.

మరిన్ని వార్తలు