సానియా ‘స్వచ్ఛ్ భారత్’

17 Oct, 2014 01:47 IST|Sakshi
సానియా ‘స్వచ్ఛ్ భారత్’

హైదరాబాద్‌లో రోడ్డును శుభ్రం చేసిన టెన్నిస్ స్టార్
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ రాకెట్‌తో బంతిని కొట్టడమే కాదు... చీపురుతో రోడ్లను కూడా శుభ్రం చేస్తానంటూ ముందుకొచ్చింది భారత స్టార్ సానియా మీర్జా. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమంలో ఈ హైదరాబాద్ అమ్మాయి కూడా భాగం పంచుకుంది. నల్లని దుస్తులు ధరించి... చేతిలో పొడవైన చీపుర్లతో గురువారం ప్రశాసన్ నగర్‌లో ఓ రోడ్డును సానియా శుభ్రం చేసింది. ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా, సోదరి ఆనం మీర్జాతో పాటు కొందరు స్నేహితులు కూడా పాల్గొన్నారు.

పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ చేసిన ప్రతిపాదన మేరకు సానియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సోమ్‌దేవ్, పి.వి.సింధు, దీపికా పల్లికల్, అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్లు షారూఖ్ ఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్, డెరైక్టర్ సాజిద్‌ఖాన్, తెలుగు హీరో రామ్‌చరణ్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావులను సానియా ‘స్వచ్ఛ్ భారత్’లో పాల్గొనాలని కోరింది. ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నం దుకు సానియాను ప్రధాని మోదీ అభినందించారు. డబ్ల్యూటీఏ ఫైనల్స్ ఆడేందుకు శుక్రవారం సానియా సింగపూర్‌కు బయలుదేరనుంది.

మరిన్ని వార్తలు