గుర్రపు స్వారీపై ముచ్చటపడ్డ గబ్బర్‌

19 Feb, 2019 13:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల అనంతరం విశ్రాంతి లభించడంతో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే గుర్రపు స్వారీ నేర్చుకోవాలని ముచ్చట పడ్డాడు. అనుకున్నదే తడువుగా గుర్రపు స్వారీలోని మెళకువలు తెలుసుకున్నాడు. దీనిలో భాగంగా గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించిన గబ్బర్‌.. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. తాను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ధావన్‌ బ్యాటింగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లే జరగ్గా, ధావన్‌ మొత్తం 117 పరుగులు సాధించాడు. తొలి టీ20లో 76 పరుగులు సాధించిన ధావన్‌.. మూడో టీ20లో 41 పరుగులు సాధించాడు. కాగా, ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆకట్టులేకోపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో 18.33 సగటుతో 55 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ధావన్‌ గాడిలో పడ్డాడు. దాదాపు 47.00 సగటుతో 188 పరుగులు సాధించాడు. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా ధావన్‌ నిలిచాడు.

త్వరలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో భారత క్రికెట్‌ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌ ఆడనుంది. ఫిబ్రవరి 24వ తేదీన ఇరు దేశాల మధ్య సిరీస్‌ ఆరంభం కానుంది.  ఇందులో రెండు టీ20ల సిరీస్‌తో పాటు, ఐదు వన్డేల సిరీస్‌ జరుగనుంది.

మరిన్ని వార్తలు