వీరేంద్ర సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత గౌరవం.. మరో ఇద్దరి కూడా..!

13 Nov, 2023 13:09 IST|Sakshi

టీమిండియా డాషింగ్‌ బ్యాటర్‌, మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత గౌరవం లభించింది. ఐసీసీ ప్రతిష్టాత్మక హాల్‌ ఆఫ్‌ ఫేమర్ల జాబితాలో వీరూకు చోటు కల్పించింది. వీరూతో పాటు భారత మాజీ మహిళా క్రికెటర్‌ డయానా ఎడుల్జీ, శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వకు కూడా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్ల జాబితాలో చోటు దక్కింది. ఈ ముగ్గురిని హాల్‌ ఆఫ్‌ ద ఫేమర్ల జాబితాలోకి చేరుస్తున్నట్లు ఐసీసీ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. 

45 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్‌ 1999-2013 మధ్యలో 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి 18641 పరుగులు సాధించాడు. ఇందులో 38 సెంచరీలు, 72 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ కూడా అయిన వీరూ తన కెరీర్‌లో 136 వికెట్లు పడగొట్టాడు. 

67 ఏళ్ల డయానా 1976-1993 మధ్యలో 20 టెస్ట్‌లు, 34 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. మహిళల టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక బంతులు సంధించిన రికార్డు ఇప్పటికీ డయానా పేరిటే ఉంది. లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ అయిన డయానా తన అంతర్జాతీయ కెరీర్‌లో 109 వికెట్లు పడగొట్టింది. 

58 ఏళ్ల అరవింద డిసిల్వ 1984-2003 మధ్యలో 93 టెస్ట్‌లు, 308 వన్డేల్లో శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించి 15645 పరుగులు సాధించాడు. ఇందులో 31 సెంచరీలు, 86 అర్ధ సెంచరీలు ఉన్నాయి. డిసిల్వ తన కెరీర్‌లో 135 వికెట్లు కూడా పడగొట్టాడు.

మరిన్ని వార్తలు