అండర్-19 విజేత సిరిల్ వర్మ

1 Mar, 2014 09:40 IST|Sakshi

చండీగఢ్: కృష్ణ ఖేతాన్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండర్-19 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిరిల్ వర్మ విజేతగా నిలిచాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో 12వ సీడ్ సిరిల్ వర్మ 21-10, 21-13 స్కోరుతో అరింతప్ దాస్ గుప్తాపై ఘన విజయం సాధించాడు. బాలికల అండర్-19 విభాగంలో ఏపీ అమ్మాయి డి. పూజకు చుక్కెదురైంది. ఫైనల్లో టాప్ సీడ్ రేవతి దేవస్థలే 21-16, 21-15తో పూజను ఓడించింది. అండర్-17 విభాగంలో రాష్ట్ర షట్లర్లు రెండు కేటగిరీల్లోనూ విజేతలుగా నిలిచారు. హోరాహోరీగా సాగిన బాలుర విభాగం ఫైనల్లో రాహుల్ యాదవ్ 18-21, 21-8, 21-16 తేడాతో ఏపీకే చెందిన రెండో సీడ్ ఎం. కనిష్క్‌పై గెలుపొంది టైటిల్ నెగ్గాడు. బాలికల ఫైనల్లో ఐదో సీడ్ వృషాలి 16-21, 21-14, 21-17 స్కోరుతో నాలుగో సీడ్ మహిమా అగర్వాల్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది.
 
 డబుల్స్ ఫలితాలు...
 అండర్-17 బాలుర డబుల్స్‌లో జి.కృష్ణ ప్రసాద్-సాత్విక్...బాలికల డబుల్స్‌లో కె.వైష్ణవి-సోనికా సాయి విజేతలుగా నిలిచారు. అండర్-19 బాలుర డబుల్స్‌లో విఘ్నేశ్ -గంగాధర రావు...బాలికల డబుల్స్‌లో  పూజ-నింగ్షీ బ్లోక్ టైటిల్ నెగ్గారు. అండర్-19 మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-డి. పూజ జోడి విజేతగా నిలిచింది.
 

మరిన్ని వార్తలు