అదే నాకు చివరి టోర్నీ: మలింగా

23 Mar, 2019 16:56 IST|Sakshi

ముంబై:  వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పబోతున్నట్లు శ్రీలంక వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగా స్పష్టం చేశాడు. అదే తనకు చివరి టోర్నీ అంటూ మలింగా పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా గాయాలతో సతమతమవుతూ పరిమితమైన క్రికెట్‌ మాత్రమే మలింగా ఆడుతున్నాడు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న మలింగా మాట్లాడుతూ..  తన రిటైర్మెంట్‌పై ఒక స్పష్టతనిచ్చాడు. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్‌ ఆడి క్రికెట్‌కు ముగింపు పలకాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. సఫారీలతో శనివారం జరిగిన రెండో టీ20లో హ్యాండ్రిక్స్‌ వికెట్‌ను మలింగా తీశాడు. దాంతో తన అంతర్జాతీయ కెరీర్‌లో 97 టీ20 వికెట్‌ను మలింగా ఖాతాలో వేసుకున్నాడు. మలింగా మరో వికెట్‌ తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో షాహిద్‌ ఆఫ్రిది సరసన నిలుస్తాడు. ప్రస్తుతం ఆఫ్రిది 98 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంచితే, ఐపీఎల్‌ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అత్యంత అనుభవజ్ఞుడైన పేసర్‌ లసిత్‌ మలింగ టోర్నీకి దూరమయ్యాడు. శ్రీలంక దేశవాళీ వన్డే టోర్నీ ‘సూపర్‌ ప్రొవిన్షియల్‌ టోర్నమెంట్‌’లో ఆడితేనే ప్రపంచ కప్‌ జట్టుకు పరిగణలోకి తీసుకుంటామని లంక బోర్డు ఆటగాళ్లకు హుకుం జారీ చేసింది. దాంతో అందులో పాల్గొనేందుకు మలింగ సిద్ధమయ్యాడు. 

మరిన్ని వార్తలు