స్టీవ్ స్మిత్ మరో రికార్డు

25 Mar, 2017 15:13 IST|Sakshi
స్టీవ్ స్మిత్ మరో రికార్డు

ధర్మశాల: భారత్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ గా అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న స్టీవ్ స్మిత్..తాజాగా మరో  రికార్డును కూడా నమోదు చేశాడు. భారత్ లో ఒక సిరీస్ లో మూడు సెంచరీలు సాధించిన రెండో పర్యాటక కెప్టెన్ గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు అలెస్టర్ కుక్ ఈ ఘనతను సాధించాడు. 2012-13 సీజన్ లో భారత్ లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టుకు  నాయకత్వం వహించిన కుక్ మూడు శతకాలను సాధించిన తొలి కెప్టెన్ గా ఉన్నాడు.


భారత్ తో నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్(111) శతకం నమోదు చేశాడు. దాంతో ఈ సిరీస్ లో మూడు శతకాలను స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.  తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో శతకం సాధించిన స్మిత్.. ఆ తరువాత మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకం చేశాడు.రాంచీలో జరిగిన మూడో టెస్టులో స్మిత్ 178 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది భారత్ లో ఆసీస్ కెప్టెన్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డుగా నమోదైంది.

మరిన్ని వార్తలు