బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు వాంతులు!

6 Nov, 2019 12:21 IST|Sakshi

న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం టీమిండియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్‌లో ఇద్దరు బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఇబ్బంది పడినట్టు వెల్లడైంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన బంగ్లా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సౌమ్య సర్కార్‌, మరో ఆటగాడు వాంతులు చేసుకున్నట్టు ‘ఈఎస్‌పీఎన్‌’ వెల్లడించింది. ఆందోళనలు పట్టించుకోకుండా ఢిల్లీలో మ్యాచ్‌ నిర్వహించడంతో బీసీసీఐపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరినప్పటికీ బీసీసీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో రద్దు చేయడం కుదరదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తేల్చిచెప్పారు. కాలుష్యాన్ని లెక్కచేయకుండా క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన రెండు జట్లను మ్యాచ్‌ ముగిసిన తర్వాత ట్విటర్‌ ద్వారా ఆయన అభినందించారు.

అయితే ఢిల్లీ కాలుష్యం తనను ఇబ్బంది పెట్టలేదని కీలక ఇన్నింగ్స్‌ ఆడిన బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీం తెలిపాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అతడు మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈ వాయు కాలుష్యం నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. నేను ఎవరి బౌలింగ్‌లో ఆడుతున్నా అనే దానిపైనే దృష్టి పెట్టాను. అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్‌ ఆడటానికి మేము ఇక్కడకు వచ్చాం కాబట్టి మిగతా విషయాలను పట్టించుకోమ’ని అతడు పేర్కొన్నాడు. భారత్‌తో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్‌ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. (చదవండి: అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్‌)

మరిన్ని వార్తలు