విచారణ వేగవంతం...  అంత తొందరేలా!

13 Jan, 2019 02:46 IST|Sakshi

సీఓఏలో తలోమాట  

న్యూఢిల్లీ: క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కె.ఎల్‌ రాహుల్‌లపై విచారణ విషయంలో బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ)లో భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ టీమిండియా జట్టు కూర్పు పటిష్టత కోసం క్రికెటర్లపై చేపట్టిన విచారణను వేగవంతం చేయాలని సూచిస్తుంటే... కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం అంత తొందరెందుకని మండిపడుతున్నారు. తూతూమంత్రం విచారణతో ఏదో రకంగా ఈ వివాదాన్ని ముగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఒక టీవీ షోలో క్రికెటర్లిద్దరు మహి ళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెను విమర్శలకు దారితీసింది. దీంతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పాండ్యా, రాహుల్‌లపై వేటు వేసింది.

ఆ వెంటనే ఇద్దరు క్రికెటర్లు ఆసీస్‌ నుంచి అర్ధంతరంగా స్వదేశం పయనమయ్యారు. జట్టు బలం ఇప్పుడు 15 సభ్యుల నుంచి 13కు పడిపోవడంతో వెంటనే విచారణ పూర్తిచేసి వారి స్థానాలను భర్తీచేయాలని సీఓఏ చీఫ్‌ రాయ్‌ భావిస్తున్నారు. దీన్ని ఎడుల్జీ విభేదించారు. లోగడ బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రి ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అరోపణలపై ఇలా తొందరపడే త్వరగా ముగించారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు హార్దిక్‌ పాండ్యా, రాహుల్‌ స్థానాల్లో మయాంక్‌ అగర్వాల్, విజయ్‌ శంకర్‌లను జట్టులోకి ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు