ఆదాయం పెరిగింది.. ర్యాంకు తగ్గింది!

12 Jun, 2019 21:56 IST|Sakshi

ఫోర్బ్స్‌ టాప్‌–100 ధనిక క్రీడాకారుల్లో అట్టడుగున కోహ్లీ

న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ 2018 ఫోర్బ్స్‌ టాప్‌–100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారుడిగా నిలిచాడు. బుధవారం విడుదలైన ఈ జాబితాలో రూ.2.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.173 కోట్లు) ఆదాయంతో అతను చిట్టచివరి స్థానం పొందాడు. ఈ ఆదాయం అంతా అతనికి ప్రకటనలు, వేతనం, ప్రోత్సాహకాల ద్వారా లభించింది. వాస్తవానికి 2017 జాబితాలో 2.4 కోట్ల డాలర్ల ఆదాయంతో 83వ స్థానం పొందిన కోహ్లీ.. ఈసారి అంతకంటే 10లక్షల డాలర్లు అధికంగా సంపాదించినా ర్యాంకు తగ్గడం గమనార్హం.

కాగా, ఈసారి జాబితాలో టాప్‌–3 స్థానాలు ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకే దక్కాయి. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ 127 మిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్‌ టాప్‌ అథ్లెట్స్‌ లిస్టులో ఒక ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ టాప్‌లో నిలవడం ఇదే మొదటిసారి. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో 109 మిలియన్‌ డాలర్లతో రెండవ, బ్రెజిల్‌ ఫుట్‌బాలర్‌ నెయ్‌మార్‌ 105 మిలియన్‌ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ 93.4 మిలియన్‌ డాలర్ల సంపాదనతో ఐదో స్థానంలో నిలిచాడు. 
 

>
మరిన్ని వార్తలు