బీజేపీలోకి ఇద్దరు టీ కాంగ్రెస్‌ ఎంపీలు?

12 Jun, 2019 22:26 IST|Sakshi

న్యూఢిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో భారీ షాక్‌ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో రహస్య మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో పాటు మాజీ ఎంపీ వివేక్‌, కేసీఆర్‌ అన్న కూతురు కల్వకుంట్ల రమ్య రావు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో భేటీ అయినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీలో చేరతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటప్పటికీ.. నేతలు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. అయితే తాజా పరిణామాలు ఆ వార్తలకు  మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకునే అవకాశం లేకపోవడంతోనే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీ టీడీపీకి చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం.

మరిన్ని వార్తలు