విష్ణువర్ధన్‌ జంటకు టైటిల్‌

3 Jun, 2019 08:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ అండర్‌–19 బాలుర డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించాడు. త్రివేండ్రంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో బాలుర డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ)–ఇషాన్‌ భట్నాగర్‌ (ఛత్తీస్‌గఢ్‌) ద్వయం 21–12, 21–14తో రవికృష్ణ–మానవ్‌రాజ్‌ సుమీత్‌ (కేరళ) జంటపై విజయం సాధించింది. టైటిల్‌ గెలిచే క్రమంలో విష్ణువర్ధన్‌ జంట ప్రత్యర్థి జోడీలకు ఒక్క గేమ్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్‌లో విష్ణువర్ధన్‌–ఇషాన్‌ 21–10, 21–16తో కీర్తి శశాంక్‌–లోకేశ్వరన్‌లపై; ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 21–12, 21–8తో రోహిత్‌ సింగ్‌–సుహాస్‌లపై; క్వార్టర్‌ ఫైనల్లో 21–9, 21–18తో కుష్‌ చుగ్‌–నితిన్‌లపై; సెమీఫైనల్లో 21–19, 21–16తో యష్‌ రైక్వార్‌–ఇమాన్‌ సోనోవాల్‌లపై విజయం సాధించారు.   

మరిన్ని వార్తలు