కోహ్లికి విశ్రాంతి

11 Oct, 2018 01:33 IST|Sakshi

విండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక నేడు

సాక్షి, హైదరాబాద్‌: టెస్టుల్లో సత్తా చాటుతున్న వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వన్డేల్లోనూ అరంగేట్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు నేడు భారత జట్టును ఎంపిక చేయనున్నారు.  ధోని స్థాయికి తగినట్లు బ్యాటింగ్‌ చేయలేకపోతుండటం, బ్యాకప్‌గా అతడికి దీటైన ఆటగాడు ఉండాల్సిన అవసరం దృష్ట్యా సెలెక్టర్లు పంత్‌ ఎంపిక దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. దినేశ్‌ కార్తీక్‌లో స్థిరత్వం లోపించడం, మ్యాచ్‌లను ముగించే సామర్థ్యం కొరవడటం కూడా పంత్‌పై దృష్టిసారించేలా చేస్తున్నాయి.

మరోవైపు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్‌ నుంచి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశ్రాంతి తీసుకుంటాడన్న వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు కొన్ని మార్పులు తప్పేలా లేదు. కేదార్‌ జాదవ్‌ గాయం బారిన పడటంతో మిడిలార్డర్‌లో అతడి స్థానం ఖాళీ అయింది. దీంతో మరో ఆటగాడిని తీసుకోవాల్సి వస్తోంది. జడేజా, అంబటి తిరుపతి రాయుడులకు ఢోకా లేదు. భువనేశ్వర్, బుమ్రా తిరిగి రావడం ఖాయం. మనీశ్‌ పాండేపై వేటు పడే అవకాశాలున్నాయి. మొదటి మూడు వన్డేలకు జట్టును ప్రకటిస్తారా? లేక మొత్తం సిరీస్‌కు ఒకేసారి ప్రకటిస్తారా? అనేది కూడా తేలాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు