ధోని ఎందుకు దేశవాళీ ఆడటం లేదు?

4 Dec, 2018 16:43 IST|Sakshi

న్యూఢిల్లీ: దాదాపు నాలుగేళ్ల క్రితం టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు. అయితే ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సైతం ధోని మెరుపులు పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో పాటు, ఆస్ట్రేలియాతో కొన్ని రోజుల క్రితం ముగిసిన టీ20 సిరీస్‌లో కూడా ధోనికి చోటు దక్కలేదు. ఆసీస్‌తో జనవరి నెలలో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌లో ధోని ఆడనున్నాడు. మరొకవైపు శిఖర్‌ ధావన్‌కు టెస్టు జట్టులో స్థానం దక్కలేదు. వీరిద్దరూ ప్రస్తుతం కుటుంబంతో గడుపుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఇదే విషయాన్ని ప్రశ్నించాడు మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస‍్కర్‌.

‘ధోని, ధావన్‌లు ఎందుకు దేశవాళీ ఆడటం లేదు. వరల్డ్‌కప్‌కు దాదాపు ఆరు నెలల సమమం మాత్రమే ఉన్న తరుణంలో సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్‌ అవసరం. ఇక్కడ ధోని, ధావన్‌లు మనం తప్పుబట్టలేం. వారిని దేశవాళీ మ్యాచ్‌లు ఆడమని బీసీసీఐ మార్గదర్శకాలు జారీ చేయకపోవడం తప్పు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పుడు కీలకమైన ఆటగాళ్లను దేశవాళీ ఆడించాలి కదా. ఈ విషయంలో బీసీసీఐ, సెలక్టర్లు ఏం చేస్తున్నారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో ధోని ఆడలేదు. ధోని అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి చాలా రోజులయ్యింది. ఎప్పుడో నవంబర్‌1 వ తేదీన మ్యాచ్‌ ఆడాడు. మళ్లీ జనవరి వరకూ మ్యాచ్‌ ఆడే అవకాశం లేదు. మ్యాచ్‌-మ్యాచ్‌కు ఇంత గ్యాప్‌ ఉండకూడదు. ఇది చాలా ఎక్కువ గ్యాప్‌గానే చెప్పాలి. మ్యాచ్‌కు మ్యాచ్‌కు ఇంతటి గ్యాప్‌ వస్తే ఆటలో మెరుపు తగ్గుతుంది. దేశవాళీ స్థాయిలో ఏదొక మ్యాచ్‌ ఆడుతూ ఉంటే అది సుదీర్ఘ ఇన్నింగ్స్‌లకు ఉపయోగపడుతుంది. అది కచ్చితంగా మంచి ప్రాక్టీస్‌ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ వరల్డ్‌కప్‌కు తక్కువ సమయం నేపథ్యంలో కీలక ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరం కావడం కచ్చితంగా తప్పే’ అని గావస్కర్‌ స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు