హేయ్‌ పీటర్సన్‌.. సైలెంట్‌ అయ్యావే?: యువీ

13 Aug, 2019 10:28 IST|Sakshi

న్యూఢిల్లీ:  ‘హేయ్‌ పీటర్సన్‌.. సైలెంట్‌గా ఉన్నావేంటి. అంతా ఓకేనా?’ అంటూ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్య ఇది. ఇది క్రికెట్‌ మ్యాచ్‌ కోసం కాదు.. ఒక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం పీటర్సన్‌కు ఇలా చురకలంటించాడు యువీ. ఆదివారం మాంచెస్టర్‌ యునైటెడ్‌- చెల్సీ జట్ల మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. మాంచెస్టర్ యునైటెడ్‌ జట్టు 4-0 తేడాతో చెల్సీపై విజయం సాధించింది. దాంతో మాంచెస్టర్‌ జట్టుకు వీరాభిమాని అయిన యువీ చెల్సీ జట్టుకు అభిమాని అయిన కెవిన్‌ పీటర్సన్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు. ఇందుకు నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేశాడు.

ఫుట్‌బాల్‌ విషయంలో వీరిద్దరూ గతంలోనూ ట్విటర్‌లో మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ జట్టును ఉద్దేశించి పీటర్సన్‌ చేసిన ట్వీట్‌కు యువీ దీటుగానే స్పందించాడు.  ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్‌ సింగ్‌.. గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో పాల్గొన్నాడు. టోరంటో నేషనల్స్‌ జట్టుకు యువీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెనడా లీగ్‌లో యువీ మెరుపులు మెరిపించి తన పాత ఆటను గుర్తు చేశాడు.

మరిన్ని వార్తలు