Asian Games 2023: పరుగుల సునామీ.. ఏకంగా 8 సిక్సర్లు.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. యువీ రికార్డు బ్రేక్‌! 9 బంతుల్లోనే..

27 Sep, 2023 10:36 IST|Sakshi
దీపేంద్ర సింగ్‌ వీర విహారం (PC: X)

Dipendra Singh Fastest T20I 50: నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఆరీ పరుగుల సునామీ సృష్టించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి చరిత్రకెక్కాడు.

ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ పేరిట(ఇంగ్లండ్‌ మీద 12 బంతుల్లో) ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.  ఆసియా క్రీడలు -2023లో భాగంగా మెన్స్‌ క్రికెట్‌ ఈవెంట్లో నేపాల్‌- మంగోలియా మధ్య తొలి మ్యాచ్‌ జరిగింది. 

చైనాలోని హోంగ్జూలో జరిగిన ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్‌ ఈ మేర సుడిగాలి అర్ధ శతకంతో మెరిశాడు. ఐదోస్థానంలో బ్యాటింగ్‌ దిగిన ఈ ఆల్‌రౌండర్‌ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. 

రెండు ఫార్మాట్లలో అద్భుత సెంచరీలు
కాగా 23 ఏళ్ల దీపేంద్ర సింగ్‌ ఆరీ 2018లో నేపాల్‌ తరఫున ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 52 వన్డేలు, 38 టీ20లు ఆడిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ఆయా ఫార్మాట్లలో వరుసగా 889, 991 పరుగులు సాధించాడు. 

అదే విధంగా ఈ రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ ఖాతాలో వన్డేల్లో 36, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ వన్డేల్లో ఈ రైట్‌ హ్యాండ్‌బ్యాటర్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు 105, టీ20లలో 110 కావడం విశేషం. 

సంచలనాలు సృష్టించిన నేపాల్‌ జట్టు
ఇక టీ20 చరిత్రలో బుధవారం(సెప్టెంబరు 27) సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆసియా క్రీడలు- 2023 మెన్స్‌ క్రికెట్‌ ఈవెంట్‌లో మంగోలియాతో మ్యాచ్‌లో నేపాల్‌ పలు అరుదైన ఘనతలు సాధించి చరిత్రకెక్కింది. 

టీ20 ఫార్మాట్‌లో 314 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. అంతేకాదు మంగోలియాను 41 పరుగులకే ఆలౌట్‌ చేసి 273 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది.

చదవండి: 34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్‌ శర్మ, డేవిడ్‌ మిల్లర్‌ రికార్డు బద్దలు 

మరిన్ని వార్తలు