నేర రహిత సమాజ స్థాపనే ధ్యేయం

18 Nov, 2014 23:04 IST|Sakshi

 న్యూఢిల్లీ: నేర రహిత సమసమాజ స్థాపనే ధ్యేయమని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ అన్నారు. మంగళవారం ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో నగరానికి చెందిన 30 మందికి ‘నగర ధైర్యవంతుల’ అవార్డులతోపాటు ప్రశంసాపత్రాలు, మెమొంటోలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరంలో నేరాలు, నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులకు సహకరించిన పలువురిని ఆయన అభినందించారు.‘  వివిధ నేపథ్యాలు ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులకు సహకరించి నిజమైన పౌరులుగా వ్యవహరించారని ఆయన అన్నారు.  నగరంలో 85 వేల పోలీసు సిబ్బంది  1.8 కోట్ల ప్రజలకు సరైన భద్రత కల్పించడం సాధ్యం కాదని, ఇది కేవలం ప్రజల సహకారం వల్ల మాత్రమే సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. అణగారిన వర్గాలకు చెందిన మహిళలు తమ ఇళ్లలో, బయటా లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఇలాంటి ఘటనలను నివారించడానికి ఆయా పరిసరాల్లోని బాలికలు, మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రత్యేక కమిషనర్ దీపక్ మిశ్రా అన్నారు.
 

మరిన్ని వార్తలు