మంగూ సింగ్‌కు గౌరవ డాక్టరేట్

13 Dec, 2014 23:45 IST|Sakshi

 న్యూఢిల్లీ: దేశంలో మెట్రో టెక్నాలజీలో చేస్తున్న అసాధారణమైన కృషికి, నాయకత్వ ప్రతిభకు గుర్తింపు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్‌కు ఓ ప్రైవేట్ యూనివర్సిట్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. నోయిడాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఎమిటీ యూనివర్సిటీ ఈ గౌరవ పురస్కారాన్ని అందచేసింది. డీఎంఆర్‌సీ సాధిస్తున్న అపూర్వమైన విజయాలు, అత్యంత వేగంగా అది సాధిస్తున్న పురోగతి వెనుక స్ఫూర్తిదాయకమైన సింగ్ నాయకత్వం ఉందని యూనివర్సిటీ అభినందించింది. సొరంగ మార్గాలను నిర్మించే టన్నెలింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఏఐ)కి అధ్యక్షునిగా మంగూసింగ్ ఢిల్లీ, కోల్‌కతా నగరాలలో మెట్రో ప్రాజెక్టు అమలులో ఎనలేని కృషి చేశారని కొనియాడింది. భారీ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో సింగ్ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని పేర్కొంది. నిర్దేశిత సమయంలో, కేటాయించిన బడ్జెట్ నిధులతోనే ప్రాజెక్టులను పూర్తి చేశారని తెలిపింది.
 

మరిన్ని వార్తలు