‘కుటుంబసభ్యులు కోరితే కేసు సీబీఐకి’

7 Sep, 2017 19:34 IST|Sakshi
‘కుటుంబసభ్యులు కోరితే కేసు సీబీఐకి’

సాక్షి, బెంగళూరు : ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర  ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించబోమని తాము ఎన్నడూ చెప్పలేదని ఆయన అన్నారు. గౌరి లంకేష్‌ కుటుంబ సభ్యులు కోరితే ఈ కేసును సీబీఐతో విచారణకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని సీఎం పేర్కొన్నారు.  బీజేపీ డిమాండ్‌ చేస్తే తాము సీబీఐ విచారణకు ఆదేశించాలా అని ఆయన ప్రవ్నించారు.

తన పత్రికలో సంఘ్‌ పరివార్‌ గురించి హేళనగా కథనాలు రాయకపోయి ఉంటే ఈ రోజు గౌరి లంకేష్‌ చనిపోయి ఉండేవారు కాదు కదా? అన్న బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్‌ వ్యాఖ్యలపై  సిద్ధరామయ్య స్పందించారు. ‘ఈ వ్యాఖ్యల అర్థమేంటి? గౌరి లంకేష్‌ హత్య వెనక ఎవరి హస్తం ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది కదా?’ అని అన్నారు.

బైక్‌ ర్యాలీ ద్వారా బీజేపీ నేతలు సమాజంలో శాంతి, సామరస్యాలను చెడగొట్టి అల్లర్లు రేపే ప్రయత్నం చేస్తున్నారని సిద్ధరామయ్య మండిపడ్డారు. ‘మంగళూరులో పాదయాత్ర నిర్వహిస్తామని బీజేపీ నేతలు ముందుగా చెప్పి ఉంటే అప్పుడే ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చి ఉండేవాళ్లమని, అయితే వాళ్లు ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెట్టే విధంగా బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పడం వల్లే  తాము అనుమతులు ఇవ్వలేదన్నారు.

నిరసన తెలిపేందుకు, సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు తాము ఎక్కడైతే అనుమతి ఇచ్చామో ఆ ప్రదేశాన్ని వదిలేసి, రాష్ట్రమంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే ఎలాంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు