పెళ్లయిన యువకులకు దేవాలయంలో బేడీలు
దేవుడి ఆజ్ఞ వచ్చే వరకూ బంధీలుగానే
విజయపుర జిల్లాలో వింత సంప్రదాయం
దొడ్డబళ్లాపురం : వివాహం‘బంధం’.. అనే మాటను అక్షరాలా పాటిస్తున్న వారెవరైనా ఉన్నారంటే అది విజయపుర జిల్లా సింధగి తాలూకా యంకంచి గ్రామంలోని ఒక తెగ వారు మాత్రమే.. అదేంటి అదెలా అని మీకు ఆసక్తిగా ఉందా?అయితే వారి గురించి మీరు తెలుసుకోవాల్సిందే... యంకంచి గ్రామంలో వందల సంవత్సరాలుగా ఇలాంటి ఒక సంప్రదాయం ఉదంటే మొదట నమ్మలేం..అయితే ఇది నిజం.. వివాహం జరిగిన తరువాత వరుడికి కాళ్లు, చేతులకు బేడీలు వేసి దేవాలయంలో వదిలేస్తారు.
అనంతరం దేవుడు కరుణించి ఆదేశించే వరకూ బేడీలతోనే దేవాలయంలో కాలం గడపాలట. స్థానిక మజావర్ అనే కుటుంబంలో ఈ వింత ఆచారం ఉంది. మగ పిల్లలకు వివాహం చేసి తక్షణం కాళ్లు, చేతులకు బేడీలు వేసేస్తారు. బేడీలు వేసుకున్న వారిని దావల్ మల్లిక్ అనే దేవాలయంలో వదిలేస్తారు. ఇప్పటికీ 18 మంది పెళ్లికొడుకులు బేడీలతో కాలం గడుపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆరుగురికి దేవుడు కరుణించడంతో బేడీలు తొలగిపోయాయట. దాంతో వారిని ఇళ్లకు పంపించేసారట. ఇలా బేడీలు తొలగిపోయే వరకూ ఆ పెళ్లికొడుకులు సంసారం చేయడానికి వీలు లేదట. ఈ సంప్రదాయాన్ని మజావర్ కుటుంబం వారు మాత్రమే ఆచరిస్తున్నారు. ఇందుకు కారణం ఈ ఆచారం నేపథ్యం వారికి తెలీనప్పటికీ పెద్దలు చెప్పినట్టుగా ఆచరిస్తున్నారు.