అక్రమ మైనింగ్‌పై వైఖరి మారిందా?

23 Oct, 2013 03:35 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
 రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చిందులు వేసిందని, బెంగళూరు నుంచి బళ్లారి దాకా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లిందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ అక్రమ మైనింగ్‌లో భాగస్వామి అయిన ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్‌ను వెనకేసుకొస్తోందని విమర్శించారు. స్థానిక మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు బళ్లారికి పాదయాత్రగా వెళుతూ డ్యాన్సులు చేశారని గుర్తు చేశారు.
 
 ఇప్పుడు ఆయన సంతోష్ లాడ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారని దెప్పి పొడిచారు. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన చిత్తశుద్ధితో చర్యలు తీసుకునేట్లయితే వెంటనే లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కాగా అధికారుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకే చెందిన 20 మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. విద్యా శాఖలో బదిలీల్లో కూడా భారీగా ముడుపులు అందాయని ఆరోపించారు. ఇది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని తేలిపోయిందన్నారు. అన్నభాగ్య పథకం కింద నాసిరకం బియ్యం ఇస్తున్నారని, పౌర సరఫరా వ్యవ స్థలో కిరోసిన్, చక్కెర పంపిణీని ఆపి వేశారని విమర్శించారు. దీని వల్ల మధ్య తరగతి కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని ఆయన తెలిపారు.
 
 ఏకవచన సంభోదన సమంజసమే
 ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సోమవారం శివమొగ్గలో ఏక వచన ప్రయోగంతో తిట్టడంలో తప్పేమీ లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యడ్యూరప్ప అలా మాట్లాడడానికి సిద్ధరామయ్యే ప్రేరణ అని చెప్పారు. అభివ ృద్ధి గురించి ప్రశ్నించినప్పుడు సిద్ధరామయ్య తగు రీతిలో సమాధానం చెప్పాల్సింది పోయి ‘జైలుకు వెళ్లిన వారు’ అని పేర్కొనడంతో యడ్యూరప్ప అలా మాట్లాడాల్సి వచ్చిందని సమర్థించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్ధరామయ్య నోటికొచ్చినట్లు మాట్లాడారని చెబుతూ, ఇప్పుడు యడ్యూరప్ప అదే ధోరణిలో మాట్లాడడంలో తప్పేముందని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు