ఆశ నిరాశేనా?

27 Feb, 2015 00:36 IST|Sakshi

చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ప్రజలకు అత్యంత ఆవశ్యకత కలిగిన ప్రయాణం అంటే రైల్వేనేనని ఠక్కున చెప్పవచ్చు. దూర ప్రయాణాలకే కాదు, లోకల్ రైళ్లపై కూడా రాష్ట్ర ప్రజలు అధికంగా ఆధారపడుతున్నారు. చెన్నై, తిరుచ్చి, మధురై, కన్యాకుమారీలను కలుపుతూ 738 కిలోమీటర్ల రైలు మార్గాన్ని డబుల్‌లైన్‌గా విస్తరించాలనే పథకం రాష్ట్ర ప్రజలకే కాక, పర్యాటకులకు సైతం ఎంతో ప్రయోజనకరం. ఈ పథకం వల్ల దక్షిణ రైల్వేకు అధిక ఆదాయం సమకూరడం ఖాయం. చెన్నై-కన్యాకుమారి రైల్వే పథకం తొలి దశ పనులను 2002లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారు. దీంతో చెన్నై నుంచి మదురై వరకు డబుల్‌లైన్ పనులు పూర్తిచేశారు. ఆ తరువాత 2012-13 ైరె ల్వేబడ్జెట్‌లో మధురై, తిరునెల్వేలీ, కన్యాకుమారీ వరకు డబుల్‌లైన్ పనులకు నిధుల కేటాయింపు తగ్గుతూ వస్తోంది. ఈ కారణంగా  చెన్నై-కన్యాకుమారీ మధ్య విద్యుద్దీకరణతో కూడిన డబుల్‌ైలైన్ పనులు పదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి.
 
 ప్రతి బడ్జెట్‌లోనూ కొద్ది మొత్తంలో నిధులు విదులుస్తున్న మూలంగా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ పథకం పరిస్థితిని బేరీజు వేసుకుంటే తమిళనాడుపై కేంద్రానికి ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నాయో తేటతెల్లం అవుతుంది. ప్రస్తుతం ఈ పథకం కింద చెన్నై-చెంగల్పట్టు మధ్య పనులు పూర్తయ్యాయి. చెంగల్పట్టు-విళుపురం మధ్య పనులు పూర్తిదశకు చేరుకున్నాయి.  తరువాత దశగా విళుపురం నుంచి దిండుగల్లు వరకు డబుల్‌లైన్ పనులకు రూ.1300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేశారు. ఇందులో రూ.600 కోట్లు నిధులు కేటాయించారు. విళుపురం-దిండుగల్లు మధ్య 69 కిలో మీటర్ల వరకు డబుల్‌లైన్ పనులు ఇటీవలే ప్రారంభించారు. మిగతా దూరానికి రూ.700 కోట్లు కేటాయిస్తేనే పూర్తవుతుంది. అంతేగాక రూ.700 కోట్లు ఈ ఏడాది విడుదలైతేనే రాబోయే రెండేళ్లలో విళుపురం-దిండుగల్లు మధ్యను డబుల్‌లైన్ పనులు పూర్తవుతాయి.
 
 దిండుగల్లు నుంచి మధురైకి ఇప్పటికే డబుల్‌లైన్ పనులు సిద్దంగా ఉన్నందున చివరి దశగా కన్యాకుమారి వరకు డబుల్‌లైన్ పనులను ప్రారంభించవచ్చు. మధురై నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 245 కిలోమీటర్ల దూరంపై సర్వేకూడా పూర్తయింది. చివరి దశ పనులకు రూ.1916 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. చివరి దశ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఏ రాజకీయవాది, ఏ అధికారి హామీ ఇవ్వడం లేదు. విళుపురం-దిండుగల్లు పనులకు రూ.700 కోట్లు కేటాయించిన తరువాతనే చివరి దశపై దృష్టి సారిస్తారు. అప్పటి కూడా ఒకే దఫాగా నిధులు కేటాయిస్తారనే నమ్మకం లేదని తెలుస్తోంది. చివరి దశ పనులు పూర్తి కావాలంటే కనీసం 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిశీలిస్తే చెన్నై-కన్యాకుమారి మధ్య విద్యుద్దీకరణతో డబుల్ లైన్ రైలు మార్గానికి కనీసం 5 ఏళ్లు ఖాయంగా భావించవచ్చు. రూ.2700 కోట్లు కేటాయిస్తే పనులు తొందరగా పూర్తిచేయవచ్చు.
 
 అయితే చెన్నై-కన్యాకుమారి రైలు మార్గం ప్రాధాన్యత తెలిసినా దక్షిణాదికి చెందిన రాజకీయనేతలు మిన్నకుండిపోతున్నారు. ఈ పథకం పూర్తయితే కన్యాకుమారి, నెల్లై, మధురై మీదుగా చెన్నై చేరుకోవడానికి ఒక గంట సమయం ఆదా అవుతుంది. అంతేగాక కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు విద్యుత్ రైలును ప్రవేశపెట్టవచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు రైలు మార్గం పథకం కింద దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నిర్మాణ పనులు పూర్తికాగా తమిళనాడు మాత్రమే డబుల్‌లైన్ విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు పోటాపోటీగా తమ పరిధిలోని రైల్వే పనులపై సమష్టిగా దృష్టి సారిస్తుండగా, తమిళనాడు నేతలు మాత్రం అనైక్యతను ప్రదర్శించడం వల్ల కేంద్రం సైతం నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. తాజా బడ్డెట్‌లోనూ రాష్ట్రంలోని పనులకు గణనీయమైన స్థాయిలో నిధుల కేటాయింపు జరగక పోవడంతో రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలింది.
 
 మోసగించారు: బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా  పూర్తి స్థాయిలో గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశతో ఎదురుచూసున్న రైల్వే బడ్జెట్‌లో చివరకు అందరినీ మోసగించారని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్‌లో ఆయిల్ ధరలు 60 శాతం వరకు తగ్గిన కారణంగా టికెట్టు చార్జీలను తగ్గించి ఉండవచ్చన్నారు. ఇందుకు విరుద్ధంగా సరకు రవాణా చార్జీలను పెంచివేశారని వ్యాఖ్యానించారు. కేంద్రం చేతిలో మోసపోయిన తమిళ ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. రైల్వేబడ్జెట్ సంతృప్తికరం: ప్రయాణికుల చార్జీలు పెంచకుండా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ సంతృప్తినిచ్చిందని అన్నాడీఎంకే అధినేత్రి,మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయమని అన్నారు. ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల రక్షణ రైల్వేస్టేషన్లు, భోగీల్లో పారిశుధ్యం వంటివాటిపై దృష్టి సారించడం ముదావహమన్నారు. తమిళనాడులో ప్రతిపాదనలో ఉన్న హైస్పీడ్ రైళ్లకు ప్రాధాన్యత కల్పించాలని ఆమె కోరారు. మొత్తం మీద 2015-16 రైల్వే బడ్జెట్‌ను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.
 

మరిన్ని వార్తలు