శస్త్ర చికిత్సతో కమ్మలు లభ్యం, కోడి మృతి
టీ.నగర్(చెన్నై): బంగారు కమ్మలను మింగిన కోడి చనిపోయిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నై పురసైవాక్కం నెల్వాయల్లో నివశించే శివకుమార్కు సంతానం లేకపోవడంతో ఏడాది క్రితం ఒక కోడి పిల్లను కొనుక్కుని పూంజి అనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. శుక్రవారం శివకుమార్ అక్క కుమార్తె దీప తలదువ్వుకుంటూ బంగారు కమ్మలను తీసి కింద పెట్టింది.
అక్కడే తిరుగుతున్న కోడి ఆ కమ్మలను మింగేసింది. శివకుమార్ వెంటనే కోడిని తీసుకుని అన్నానగర్లోని ఒక వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లాడు. డాక్టర్ కోడికి ఎక్స్రే తీసి కమ్మలు కోడి ఉదరంలో ఉన్నట్లు గుర్తించాడు. కోడికి ఆపరేషన్ చేసి కమ్మలను వెలికి తీశాడు. అయితే కమ్మలలోని సూది మొన లాంటి భాగం కోడి ఉదరాన్ని గాయపరచడంతో కొద్ది సేపటికే అది చనిపోయింది. ప్రాణప్రదంగా పెంచుకున్న కోడి చనిపోవడంతో శివకుమార్, దీప భోరున విలపించారు. వారు కన్నీరు కార్చడం అక్కడి వారిని కదిలించింది.