జల్లికట్టు..పెటా పట్టు

3 Feb, 2018 05:04 IST|Sakshi

నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌

నో చెప్పిన న్యాయమూర్తి

డివిజన్‌ బెంచ్‌కు కేసు బదలాయింపు

పట్టువదలని పెటా!

జల్లికట్టు క్రీడకు మార్గం సుగమం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ ‘పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌’(పెటా) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన డివిజన్‌బెంచ్‌కు శుక్రవారం పిటిషన్‌ను బదలాయించింది. జల్లికట్టుపై నిషేధం తీసుకురావాలని పెటా పట్టుదలతో పోరాడుతోంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: జంతు సంక్షేమ సంరక్షణ చట్టం పరిధిలోని జంతువుల జాబితాలో ఉన్న ఎద్దులను ఆ జాబితా నుంచి కేంద్రం తొలగించడంతో రాష్ట్రంలో జల్లికట్టు క్రీడ యథావిధిగా సాగుతోంది. అయితే తమిళనాడులో జల్లికట్టు క్రీడపై నిషేధం విధించాలని జంతు సంక్షేమ సంఘం గతంలో ఒక పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు ముగిసిన తరువాత 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషే«ధం విధించింది.  తమిళనాడు ప్రజల ఆచార, వ్యవహరాల్లోనూ, ప్రాచీన సంప్రదాయక్రీడైన జల్లికట్టులోనూ జోక్యం తగదని నినాదాలు చేశారు.

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ 2017 జనవరి 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. చెన్నై మెరీనా తీరంలో విద్యార్థులు, యువజనులు లక్షలాదిగా తరలివచ్చి నిరవధిక ఆందోళనకు దిగారు. పిల్లలు పెద్దలు, యువతీ యువకులు మెరీనాతీరం చేరుకున్నారు. జల్లికట్టు ఉద్యమంలో ఆందోళనకారులు ఉడుంపట్టు మొత్తం ప్రపంచాన్నే ఆకర్షించి తనవైపునకు తిప్పుకుంది. ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.

అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అదే ఏడాది జనవరి 20వ తేదీన జల్లికట్టుపై ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి రాష్ట్రగవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌ సదరు ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదానికి పంపడం వెంటనే ఆమోద ముద్ర పడడం చకచకా జరిగిపోయాయి. దీంతో 22వ తేదీన మదురై జిల్లా అలంగానల్లూరులో జల్లికట్టు క్రీడలు ఉత్సాహంగా సాగాయి. ఆనాటి నుంచి రాష్ట్రంలో పొంగల్‌ పండుగల దినాల్లో జల్లికట్టు క్రీడలు యథావిధిగా జరుగుతున్నాయి.

అయితే పన్నీర్‌సెల్వం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను పెటా తీవ్రంగా గర్హిస్తూ జల్లికట్టుపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌పై బదులివ్వాల్సిందిగా సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వం వివరణతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ కేసు న్యాయమూర్తి రోహింగ్టన్‌ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. జల్లికట్టుపై మధ్యంతర నిషేధం విధించలేమని, అయితే ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన డివిజన్‌ బెంచ్‌కు బదలాయిస్తున్నట్లు న్యాయమూర్తి రోహింగ్టన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు