ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

1 Oct, 2017 06:16 IST|Sakshi

సూర్యాపేట :
సూర్యాపేట జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దులచెరువు సమీపంలో ఆగివున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ లగ్జరీ బస్సు (బస్సు నెంబర్‌ : ఏపీ16 జెడ్‌ 0216) ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా 14మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీ బస్సు మునగాల సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఆగివున్న లారీని ఢీకొట్టింది. బస్సు ఒక వైపు మొత్తం బలంగా లారీని దూసుకుంటూ వెళ్లింది. దీంతో బస్సు సగభాగం ధ్వంసమైంది. తెల్లవారుజామున 3గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను కోదాడ, సూర్యాపేట వైద్యశాలలకు చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన 14మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను ఏడుకొండలు(లారీ డ్రైవర్), రాణి(సూర్యపేట), సత్తయ్య (కోదాడ), ఎన్‌.వి.ప్రసాద్ (అవనిగడ్డ), ఎం.ఎం.ప్రసాదరావు (అవనిగడ్డ)లుగా గుర్తించారు. కృష్ణాజిల్లా కోసూరుకు చెందిన మునగాల రమాదేవి, పెద్దకూడి సుబ్బారావు, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన రాణిల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కోదాడ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పి ప్రకాష్ జాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు