నాగార్జునసాగర్ (నల్లగొండ): విద్యుత్ ఉద్యోగుల విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర జెన్కో విద్యుత్ సంస్థ స్థానికత ఆధారంగా ప్రకటించిన జాబితాలో 526 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉన్నారు. సర్వీసు రికార్డులు, నియామక ఉత్తర్వులు, పోలీస్ విచారణలను ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగుల విభజన చేసినట్లు టీ-జెన్కో గురువారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా జెన్కోలో 526 మంది ఆంధ్రా ఉద్యోగులున్నట్లు ఉన్నతాధికారులు తేల్చారు.
ఇందులో ఇంజినీర్లు 465 మంది కాగా.. అకౌంట్స్ తదితర విభాగాల్లో 57 మంది ఉన్నట్లు టీ-జెన్కో ఆన్లైన్లో ఆ మేరకు జాబితా ఉంచింది. మరో నలుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు పేర్కొంది. కాగా, సాగర్ జెన్కోలో ఎస్ఈ ఒకరు, డీఈలు ఇద్దరు, ఏడీ ఈలు 12మంది, ఏఏవో ఒకరు, ఏఈలు 11 మంది, ఈఈ సివిల్ ఒకరు, డాక్టర్ ఒకరు, ఎస్ఏఓ ఒకరు మొత్తం 30 మంది ఉన్నట్లు వెల్లడించింది. వారందరినీ ఆర్డర్టూ సర్వ్ పద్ధతిలో రిలీవ్ చేయనుంది.