భిక్నూర్ (నిజామాబాద్) : వేగంగా వెళ్తున్న రైలు నుంచి జారి కిందపడిన ఓ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భిక్నూర్ మండలం తాళ్లమడ్ల సమీపంలో చోటుచేసుకుంది. బోధన్ మండలం పెంటకుర్దు గ్రామానికి చెందిన నర్సింహులు భార్య, కుమారుడితో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నర్సింహులు కుమారుడు ఆకాష్(8) తాళ్లమడ్ల గ్రామ సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు.
రాళ్లపై పడటంతో తీవ్రగాయాలపాలైన బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. రైలు కామారెడ్డి స్టేషన్లో ఆగిన తర్వాత కుమారుడు లేడన్న విషయాన్ని నర్సింహులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు వెంటనే స్పందించి ఆకాష్ చనిపోయిన విషయం తెలుసుకుని ధ్రువీకరించటంతో అతడు హతాశుడయ్యాడు.