హాజీపూర్‌కు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి 

10 May, 2019 01:03 IST|Sakshi

బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ గ్రామ పరిసరాలకు వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని గురువారం పోలీసులు తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు మరోమారు హాజీపూర్‌లో పికెట్‌ ఏర్పాటు చేశారు. బాలికల హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను కోర్టు అనుమతితో వరంగల్‌ జైలు నుంచి స్థానిక పోలీసులు 6 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో నిందితుడిని గ్రామంలోని ఘటనా స్థలాల వద్దకు గురువారం తీసు కొచ్చి విచారణ జరిపినట్లు సమాచారం.

అయితే గ్రామ పరిసరాలకు శ్రీనివాస్‌ను తీసుకొచ్చిన అంశాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలోనే హాజీపూర్‌ లో రెండ్రోజుల క్రితం ఎత్తివేసిన పోలీస్‌ పికెట్‌ను గురువారం పునరుద్ధరించారు. బాలికల హత్య కేసు విచారణ అధికారిగా ఉన్న భువనగిరి ఏసీపీ భుజంగరావు స్ధానిక పోలీస్‌ స్టేషన్‌తోపాటు హాజీపూర్‌ను గురువారం సందర్శించారు.    

మరిన్ని వార్తలు