మళ్లీ మోగనున్న ఎన్నికల నగారా!

16 Apr, 2019 08:13 IST|Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: గతేడాది సెప్టెంబర్‌లో మొదలైన ఎలక్షన్స్‌ సీజన్‌ ఎని మిది నెలలుగా ఆగకుండా కొనసాగుతూనే ఉంది. ‘ఒకటి తర్వాత ఇం కోటి’ అన్న చందంగా మొదట శాసనసభ ఎన్నికలు.. తర్వాత పంచా యతీ ఎన్నికలు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఈమధ్య ఎంపీ ఎన్నికల కోలాహాలం మొన్నటి వరకు కొనసాగింది. ఇంకా లోక్‌సభ ఎన్నికల ఫలితా లు వెలువడాల్సి ఉండగానే.. ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. అంటే.. అదే కోలాహలం మరో నెల రోజులపాటు కొనసాగనుండగా.. మరో ఎన్నికల నగారా త్వరలోనే మోగనుందన్న మాట! 
రాష్ట్రంలో, జిల్లాలో ఎనిమిది నెలలుగా ఎన్నికల వాతావరణం నెలకొంది.

ప్రస్తుత టీఆర్‌ఎస్‌ సర్కారు 2018 సెప్టెంబర్‌ 6న శాసన సభను రద్దు చేసినప్పటి నుంచి మొదలైన ఎన్నికల సందడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గత డిసెంబర్‌ 7న శాసనసభ ఎన్నికలు, ఈ ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు, మార్చిలో శాసనమండలి, ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. తాజాగా మే నెలలో పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.

ఎనిమిది నెలల్లో ఇప్పటికే నాలుగు రకాల ఎన్నికలు జరగగా, వచ్చే నెలలో మరో ఎన్నిక జరుగనుంది. పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో సందడి చేయగా, శాసనసభ, లోక్‌సభ, శాసన మండలి ఎన్నికలు పట్టణాలతోపాటు పల్లెల్లోనూ ఉత్సాహాన్ని నింపాయి. కాగా, త్వరలో జరుగనున్న జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు మరో నెల రోజులపాటు గ్రామాల్లో సందడి చేయనున్నాయి.

వేగంగా ‘పరిషత్‌’ ఏర్పాట్లు.. 
మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపక్క పోలింగ్‌ కేంద్రాలను గుర్తిస్తూనే.. మరో పక్కా ఎన్నికల సిబ్బందిని సేకరించడం, వారికి శిక్షణలు, పోలింగ్‌ మెలకువలు నేర్పిస్తున్నారు. ఇది వరకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు పూర్తి చేసిన యంత్రాంగం, ఓటర్ల జాబితాను సైతం సిద్ధం చేసి ఎన్నికలకు రెడీగా ఉంచింది. ఒక్కో మండలానికి ఒక్కో జెడ్పీటీసీ రిటర్నింగ్‌ అధికారిని నియమించగా, మరో 20 శాతం మంది రిటర్నింగ్‌ అధికారులను రిజర్వులో ఉంచనున్నారు.

రెండు నుంచి ఐదు ఎంపీటీసీ స్థానాలకు ఒక ఎంపీటీసీ రిటర్నింగ్‌ అధికారిని నియమించగా, సహాయ రిటర్నింగ్‌ అధికారులను సైతం అంతే మోతాదులో నియమించి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 17 మండలాలు ఉండగా, వీటి పరిధిలో మొత్తం 848 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారిని నియమించగా, 20 శాతం మంది పీవోలను రిజర్వులో ఉంచనున్నారు. అంతే మొత్తంలో సహాయ ప్రిసైడింగ్‌ అధికారులను కూడా నియమించి రిజర్వులో ఉంచారు.
 
రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ.. 
జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ), మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) స్థానాలకు ఆయా అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు రిటర్నింగ్‌ అధికారులు నియమించబడ్డారు. మొత్తం 17 మంది జెడ్పీటీసీ రిటర్నింగ్‌ అధికారులు, 60 మంది ఎంపీటీసీ రిటర్నింగ్‌ అధికారులు, మరో 60 మంది సహాయ రిటర్నింగ్‌ అధికారులకు సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహించారు.

ఈ శిక్షణలో నామినేషన్‌ పత్రాలను స్వీకరణ, ఏఏ ఫారాలు ఉంటాయి.. పత్రాలను ఎలా పరిశీలించాలి, ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలకు సంబంధించి ఆర్వోలకు, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చారు. మాస్టర్‌ ట్రైనీల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణకు జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్, జెడ్పీ సీఈవో కె.నరేందర్‌ హాజరై రిటర్నింగ్‌ అధికారులు పలు సూచనలు ఇచ్చారు. కాగా, 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయగా, 400 మంది ఓటర్లు ఉన్న పీఎస్‌లలో ముగ్గురు ఓపీవోలు, 600 మంది ఓటర్లు ఉన్న పీఎస్‌లలో నలుగురు ఓపీవోల చొప్పున ఎన్నికల బాధ్యతలు అప్పగించారు.

నేడు పీవో, ఏపీవోలకు.. 
పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక పీవో, ఒక ఏపీవో, ఒక ఓపీవోను నియమించారు. ప్రిసైడింగ్‌ అధికారులు (పీవో) సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు (ఏపీవో), ఇతర ప్రిసైడింగ్‌ అధికారుల (వోపీవో)కు మంగళవారం శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఈ శిక్షణ జరుగనుంది. పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణ పూరైన వెంటనే పోలింగ్‌ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, మరమ్మతులు, ఇతర పనులు చేపట్టి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 18న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్‌ సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు పరిషత్‌ ఎన్నికలపై కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు