రైల్వే లైన్‌ వేగవంతం..

1 Jan, 2019 08:18 IST|Sakshi

సత్తుపల్లి–భద్రాచలం రోడ్‌’కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

భూసేకరణకు 156.38 కోట్లు చెల్లించిన సింగరేణి 

2020 వరకు 15 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా చేయాలని అంచనా 

సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం 

సింగరేణి(కొత్తగూడెం): సత్తుపల్లి–భద్రాచలం రోడ్‌ (కొత్తగూడెం రుద్రంపూర్‌) రైల్వే పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పనులను అధికారులు వేగవంతం చేయనున్నారు. రైల్వే అధికారులు దాదాపు సర్వే పను లు పూర్తి చేశారు. 53 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఈ లైన్‌కు 50 శాతం భూసేకరణ పనులు పూర్తయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఇంకా మిగిలిన పనులను రైల్వేశాఖ త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిసింది. అయితే సత్తుపల్లి ఏరియాలో బొగ్గు రవాణా రోజు రోజుకు పెరుగుతు న్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని సింగరేణి అధికారులు భావించి రూ.618.55 ఖర్చు చేయటానికి సంసిద్ధపడి దానిలో రూ.156. 38 కోట్లను చెల్లించింది. ఈ రైల్వే లైను పొడవు సుమారు 53.50 కిలోమీటర్లకు రూ.704.31 కోట్లు అవుతుందని అంచనా. వీటిలో 16 జూలై 2018 వరకు సింగరేణి సంస్థ రూ.156.38 కోట్లు చెల్లించింది. ఈ పనులు పూర్తయితే 2020 సంవ త్సరం నాటికి సుమారు 15 మిలియన్‌ టన్నుల బొగ్గును రవాణా చేయనున్నట్లు రైల్వే, సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సింగరేణికి బొగ్గు రవాణా ఖర్చు లక్షల్లో ఉంటుందని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 రోజుకు 30 వేల టన్నుల బొగ్గు రవాణా  
ప్రస్తుతం కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్‌ఓసీ–1, 2లలో రోజుకు సుమారు 30 వేల టన్నుల బొగ్గు 800 (చిన్న, పెద్ద) లారీలలో రుద్రంపూర్‌లోని ఆర్‌సీహెచ్‌పీకి వస్తుంది. ఈ రవాణా పక్రియలో ప్రమాదాల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగాయని కార్మికులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా బొగ్గు లారీల రాకపోకల వలన దుమ్ము, ధూళి వచ్చి పర్యావరణం దెబ్బతినటమే కాకుండా రోడ్డు వెంట నివసించే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అదేవిధంగా శబ్దకాలుష్యంతో రాత్రింబవళ్లు కష్టపడి వచ్చిన ప్రజలకు నిద్ర ఉండటంలేదని వాపోతున్నారు. ఈ పనులు పూరయ్తితే వీటన్నిటికి ఉపశమనం జరుగుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
సత్తుపల్లిలో మరో నాలుగు ఓసీలకు రంగం సిద్ధం 
సత్తుపల్లిలో జలగం వెంగళరావు ఓసీ–1ను 2006లో సింగరేణి సంస్థ ప్రారంభించి ఏడాదికి సుమారు 50 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. ఇదేక్రమంలో 2017లో  జేవీఆర్‌ ఓసీ–2లో ఉత్పత్తిని ప్రారభించింది. దీని జీవితకాలం సుమారు 29 సంవత్సరాలు. సంవత్సరానికి సుమారు ఒక మిలియన్‌ టన్ను బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ –3 కొమ్మేపల్లి ప్రాంతంలో మరో మూడేళ్లలో ఇక్కడ కూడా ఓసీ ప్రారంభం కానుంది. అదేవిధంగా కిష్టారం ఓపెన్‌కాస్ట్, ఇవన్నీ కలుపుకొని ఏరియాలో రానున్న మరో నాలుగేళ్లలో 10 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణాకు సన్నాహాలు చేస్తున్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తిచేసే బొగ్గును లారీల ద్వారా కాకుండా రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేస్తే సంస్థకు లక్షలాది రూపాయల లాభంతో పాటు అక్రమ రవాణాకు చెక్‌ పడుతుందని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

అభివృద్ధి చెందనున్న పలు గ్రామాలు 
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాలోని గ్రామాలను కలిపే ఈ రైల్వే మార్గం వల్ల కొత్తగూడెం, చండ్రుగొండ, మద్దుకూరు, అన్నపురెడ్డిపల్లి, లంకపల్లి, మండలాల గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. దీనివలన పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగనుంది. 
 

మరిన్ని వార్తలు