చీప్‌లిక్కర్‌ జోష్‌

22 Sep, 2018 12:35 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : మద్యం అమ్మకాల్లో చీప్‌ లిక్కర్‌ విక్రయాలు ప్రతీ ఏడాది గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ లిక్కర్‌ ప్రభుత్వానికి గణనీయం గా ఆదాయం తెచ్చి పెడుతోంది. ఈ ఐదేళ్లలో పెరిగిన రెట్టింపు అమ్మకాలే దీనికి నిదర్శనం. మీడియం, ప్రీమియం లిక్కర్‌తోపాటు చీప్‌లిక్కర్‌ విక్రయాలు కూడా ఎక్కువగా సాగుతున్నాయి. మందు సేవించే వారిలో ప్రధానంగా పేదవారు చీప్‌లిక్కర్‌ అధికంగా తీసుకుంటుంటారు. కాగా ఇది ఎన్నికల కాలం కావడంతో ఈ మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీలోనైనా ర్యాలీలు, సభలు నిర్వహించే సమయంలో మద్యం  పొంగిపొర్లుతుంది. అందులో అధికంగా చీప్‌ లిక్కర్‌ జోషే కనిపిస్తోంది. దీంతో ఈ ఎన్నికలు ముగిసే వరకు ఈ లిక్కర్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎౖ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

కట్టడితోనే..
2013–14కు ముందు ఎక్సైజ్‌ శాఖ మద్యం అమ్మకాలకు సంబంధించి కేవలం ఐఎంఎల్‌(ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌) కేసులు, బీర్‌ కేసులను పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని గణించేవారు. ఆ తర్వాత ఈ రెండింటితోపాటు చీప్‌ లిక్కర్‌ అమ్మకాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఆ ఎక్సైజ్‌ పరిధిలో ఎంత చీప్‌లిక్కర్‌ అమ్మకాలు పెరిగితే అంత దేశీదారు, నల్లబెల్లం, సారా, కల్తీకల్లును అరికట్టినట్లుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇది ఆయా ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్‌ అధికారుల పనితీరును స్పష్టం చేసే పరిస్థితి కనిపిస్తోంది. 2013–14లో 2,28,533 కేసుల చీప్‌ లిక్కర్‌ విక్రయాలు ఉంటే గత ఏడాది ఇవి 4,66,665 కేసుల విక్రయాలు పెరిగింది. తద్వారా రెట్టింపు అయింది. ఇది అక్రమ మద్యాన్ని నిరోధించడంతోనే చీప్‌లిక్కర్‌ అమ్మకాలు పెరిగాయి.

ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉండడం, అక్కడి నుంచి దేశీదారు అక్రమంగా జిల్లాలోకి రవాణా చేస్తుండడంతో మన రాష్ట్రంలో దొరికే చీప్‌ లిక్కర్‌ అమ్మకాలపై ప్రభావం పడేది. ప్రధానంగా కూలీలు, పేద వర్గాలు దేశీదారు సేవనం చేయడంతో ఇది మన లిక్కర్‌ అమ్మకాల ఆదాయంపై ప్రభావం చూపేది. దీంతో ప్రభుత్వం ప్రధానంగా దేశీదారును కట్టడి చేయడం ద్వారా చీప్‌ లిక్కర్‌ అమ్మకాలను పెంచేందుకు ఎక్సైజ్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో దాడులు చేయడం జరుగుతోంది. దీంతోపాటు మళ్లీ మళ్లీ అక్రమ విక్రయాలు చేస్తూ పట్టుబడిన వారిపై జరిమానా విధించడంతోపాటు బైండోవర్లు చేయడం, తదితర కారణంగా జిల్లాలో అక్రమ, కల్తీ మద్యం అమ్మకాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు.

సరిహద్దు మండలాల నుంచే..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు పాత మండలాల పరంగా మహారాష్ట్రకు సరిహద్దుగా 21 మండలాలు ఉన్నాయి. నిర్మల్‌ జిల్లాలో ముథోల్, తానూర్, కుభీర్, భైంసా, కుంటాల, ఆదిలాబాద్‌ జిల్లాలో బోథ్, బజార్‌హత్నూర్, తాంసి, తలమడుగు, తాంసి, బేల, జైనథ్, నార్నూర్, కుమురంభీం జిల్లాలో కెరమెరి, వాంకిడి, కాగజ్‌నగర్, సిర్పూర్‌(టి), కౌటాల, బెజ్జూర్, దహెగాం, మంచిర్యాల జిల్లాలో వేమనపల్లి, కౌటాల మండలాలు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్నాయి. దేశీదారు మహారాష్ట్రంలో తక్కువ ధరకు దొరకుతుండడంతో కొంత మంది అక్కడి నుంచి పెద్ద ఎత్తున సరుకుని కొనుగోలు చేసి అక్రమంగా మన జిల్లాకు తీసుకుని వచ్చి కొంత ఎక్కువ ధరతో విక్రయించడం ద్వారా అక్రమ మద్యం వ్యాపారం చేసేవారు.

ఇప్పటికీ ఈ అక్రమ వ్యాపారం ముందులాగా జోరుగా సాగకపోయినప్పటికీ అంతో ఇంతో కొనసాగుతోంది. ప్రధానంగా ఇది వరకు మద్యం వ్యాపారంలో ఉండి ఆ తర్వాత అక్రమ మార్గం పట్టిన పలువురు కల్తీ మద్యం తయారీకి పాల్పడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇలాంటి సంఘటన నేరడిగొండలో బయటపడింది. దేశీదారుతో కొన్ని రసాయనాలు కలపడం ద్వారా చీప్‌ లిక్కర్‌గా తయారు చేసి విక్రయించిన ఉదాంతం జిల్లాలో బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో దేశీదారు విక్రయాలు, నల్లబెల్లం, గుడుంబా, కల్తీకల్లు విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 

ఎన్నికల్లో పొంగిపొర్లడం ఖాయం..
ఎన్నికల వేళ చీప్‌ లిక్కర్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం పార్టీల ర్యాలీలు, సభలు జోరందుకోవడంతో నేతలు లిక్కర్‌పరంగా మోయలేని భారం పడుతోంది. దీంతో చీప్‌ లిక్కర్‌తో ఈ వ్యయభారం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే ఆయా పార్టీలు పెద్ద మొత్తంలో ఈ లిక్కర్‌ను డంప్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొంగర్‌కొలాన్‌ సభ తర్వాత ముందస్తు ఎన్నికలు ఖాయం అనే సంకేతాలు వెలువడడంతో పలు పార్టీలు వీటిని ఇప్పటికే డంప్‌ చేసుకోవడం జరిగింది. సాధారణంగా రూ.400 లోపు మద్యాన్ని చీప్‌ లిక్కర్‌గా పరిగణిస్తారు. ఆపై రూ.1000 వరకు మీడియం లిక్కర్‌గా, ఆపై ధర ఉన్న లిక్కర్‌ను ప్రీమియం లిక్కర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు.

రూ.400 లోపు విలువైన మద్యాన్ని ఆయా పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో సాయంత్రం ప్రచారం పూర్తికాగానే కార్యకర్తలకు మందు, విందు తప్పనిసరి. ఈ దృష్ట్యా ఈ నాలుగు నెలల కాలంలో ఎక్సైజ్‌ శాఖకు గణనీయంగా ఆదాయం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే రూ.1078 కోట్ల ఆదాయం అన్ని రకాల మద్యం విక్రయాల ద్వారా వచ్చింది. మరో రెండు నెలల్లో వార్షిక సంవత్సరం ముగుస్తుంది. అప్పటికీ ఈ ఆదాయం ఉమ్మడి జిల్లాలో 12 వందల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.

చీప్‌ లిక్కర్‌ విక్రయాలు పెరిగాయి..
సారా, నల్లబెల్లం, దేశీదారు, కల్తీకల్లును కట్టడి చేయడంతోనే జిల్లాలో చీప్‌ లిక్కర్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అక్రమ మద్యం విక్రయాలు మళ్లీ మళ్లీ చేస్తే వారిని పట్టుకుని తహసీల్దార్‌ వద్ద బైండోవర్లు చేయడం, రూ.లక్ష జరిమానా, కట్టని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష వంటి అమలు చేయడంతో ప్రభావం చూపుతోంది. దేశీదారు ప్రభావం తగ్గడంతో చీప్‌ లిక్కర్‌ అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ దిశగా ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్‌ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అక్రమ మద్యాన్ని నిరోధించాలి.
– టి.డేవిడ్‌ రవికాంత్, ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌ డివిజన్, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు