చెక్‌డ్యాంలతో సత్ఫలితాలు

20 Mar, 2019 16:57 IST|Sakshi
గుండేడ్‌ శివారులో దుందుబీపై నిర్మించిన చిన్న చెక్‌ డ్యాం

బోర్లలో పెరగనున్న  భూగర్భజలాలు

తీరనున్న తాగు,సాగునీటి కష్టాలు 

సాక్షి, బాలానగర్‌: మండలంలోని గుండేడ్‌–బాలానగర్, మాచారం – నందారం, పెద్దాయపల్లి–బోడజానంపేట, కేతిరెడ్డిపల్లి గ్రామాల శివారులోని దుందుబీ వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో వర్షాలు పడితే చెక్‌డ్యాం లు నిండి పరిసర గ్రామాల్లో నీటి కష్టాలు తీరను న్నాయి. ఏళ్లుగా గ్రామాల్లో నీటికష్టాలు మిన్నంటి నా గతంలో దుందుబీ నదిపై నిర్మించిన చెక్‌డ్యాం లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో మరిన్ని చెక్‌డ్యాంల నిర్మాణానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో మండలంలోని గుండేడ్‌ శివారులో రూ.కోటి 4 లక్షలతో రెండు, బోడాజానంపేట శివారులో రూ.29 లక్షలతో మరొకటి మొత్తం మూడు చెక్‌డ్యాంలు నిర్మించడానికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తిచేశారు. 

ప్రస్తుత చెక్‌డ్యాంలు సత్ఫలితాలు 
మండల కేంద్రంతోపాటు, పెద్దాయపల్లి, గౌతా పూర్‌ శివారులో ఏర్పాటు చేసిన చెక్‌డ్యాంలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత వర్షాకాలంలో చెక్‌డ్యాంలు నిండి భూగర్భజలాలు పెరిగి వ్యవసా య బోర్లలో నీరు సంవృద్ధిగా లభించింది. వ్యవసాయ బోర్లలో నీరు సంవృద్ధిగా లభ్యమై బోరు మోటార్లు కాలిపోయే పరిస్థితి తప్పుతుంది. అంతేకాకుండా గతేడాదితో పోల్చితే తాగునీటి సమస్య పెద్దగా రాలేదు. పశువులకు తాగునీరు కొరత లేకపోవడమే కాకుండా సాగు విస్తీర్ణం పెరిగింది. 

గ్రామాలకు ప్రయోజనాలు 
మండలంలోని గుండేడ్, బోడజానంపేట శివారులో దుందుబీ నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే చెక్‌డ్యాంల పరిసర గ్రామాలైన మాచారం, నందారం, గుండేడ్, బాలానగర్, చెన్నంగులగడ్డ తండా, పెద్దాయపల్లి, గౌతాపూర్, సేరిగూడ, బోడజానంపేట, గాలిగూడ గ్రామాలకు ప్రయోజనం లభించనుంది. ఆయా గ్రామాల శివారులలో భూగర్భజలాలు పెరిగి తాగునీటితోపాటు, వ్యవసాయానికి సైతం నీరు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు