కేసీఆర్‌ సోదరి భర్త మృతి

8 Feb, 2020 14:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్‌ సోదరి భర్త పర్వతనేని రాజేశ్వరరావు (84) శనివారం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లకి చెందిన  రాజేశ్వరరావు నగరంలోని అల్వాల్‌ మంగాపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. కేసీఆర్‌ మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్‌ చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

రాజేశ్వరరావు మరణవార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉదయమే అక్కడికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లు రాజేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం తిరుమలగిరి స్వర్గదామ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు రాజేశ్వరరావు నివాసంలోనే ఉన్నారు. కాగా, సీఎం సోదరి, రాజేశ్వరరావు సతీమణి విమలాదేవి గతేడాది చనిపోయారు. 

మరిన్ని వార్తలు