ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బంది కేటాయింపు 

7 Jan, 2020 08:18 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్‌ ద్వారా ఎన్నికల సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్‌ శశాంక తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో ఎన్నికల అబ్జర్వర్‌తో కలిసి మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బందిని కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌స్టేషన్‌కు ఒక ప్రిసైడిండ్‌ అధికారి, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ అధికారులను మొత్తం ఐదుగురిని ఒక బృందంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మున్సిపల్‌ పరిధిలో పని చేయని, ఇతర మండలాల్లో పని చేస్తున్న సిబ్బందిని, ఒకే స్కూల్, ఒకే కార్యాలయం నుంచి ప్రిసైడింగ్, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, అన్ని పోలింగ్‌ టీంలలో ఒక మహిళ ఉద్యోగి ఉండేలా కేటాయింపులు చేశామని, పోలింగ్‌ విధుల్లో మున్సిపల్‌ ఉద్యోగులను ఎవరినీ నియమించలేదని పేర్కొన్నారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో 348 మంది ప్రిసైడింగ్‌ అధికారులు(పీవో), 348 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు(ఏపీవో), 1,044 మంది ఇతర పోలింగ్‌ అధికారులు, మొత్తం 1,710 మంది సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు.

హుజూరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 46 మంది పీవోలు, 46 మంది ఏపీవోలు, 138 మంది ఇతర పోలింగ్‌ సిబ్బంది మొత్తం 230 మంది, జమ్మికుంట మున్సిపాలిటీకి 60 మంది పీవోలు, 60 మంది ఏపీవోలు, 180 మంది ఇతర పోలింగ్‌ అధికారులు, మొత్తం 300 మంది సిబ్బందిని కేటామయించినట్లు తెలిపారు. చొప్పదండి మున్సిపాలిటీకి 24 మంది పీవోలు, 24 మంది ఏపీవోలు, 72 మంది ఇతర సిబ్బంది మొత్తం 120 మంది, కొత్తపల్లి మున్సిపాలిటీకి 15 మంది పీవోలు, 15 మంది ఏపీవోలు, 45 మంది ఇతర సిబ్బంది, మొత్తం 75 మందిని కేటాయించినట్లు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో 20 శాతం పోలింగ్‌ సిబ్బందిని రిజర్వ్‌గా ఉంచుటకు గుర్తించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు అద్వైత్‌సింగ్, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య, కరీంనగర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు