దేశంలోనే తొలిసారి ఆన్‌లైన్‌లో కోర్టు ఫీజు

20 Jun, 2019 03:19 IST|Sakshi
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, ఎస్‌బీఐ సీజీఎం ఓంప్రకాశ్‌ మిశ్రాల సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేస్తున్న హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌బీఐ డిప్యూటీ జీఎం పిళ్లై

ఎస్‌బీఐతో ఎంఓయూ కుదుర్చుకున్న  హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ద్వారా కోర్టు ఫీజులు చెల్లింపునకు వీలుగా తెలంగాణ హైకోర్టు–స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ల మధ్య ఒప్పందం కుదిరింది. దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని తెలంగాణ హైకోర్టులో అమలు చేయనున్నారు. డిజిటల్‌ సేవల్ని వినియోగంలోకి తెచ్చే క్రమంలో ఎస్‌బీఐతో కుదిరిన ఒప్పందం మేరకు బుధవారం సాయంత్రం హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయూ కుదిరింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓం ప్రకాశ్‌ మిశ్రాల సమక్షంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గీతా ఎస్‌.పిళ్లైలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ షమీమ్‌అక్తర్‌ పాల్గొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ (ఐటీ) డి.హేమంత్‌కుమార్, ఎస్‌బీఐ జీఎం వి. రమేశ్‌లు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు