ప్రమాదాల నుంచి  కాపాడేందుకే ఈ–చలాన్‌

12 Jan, 2019 12:48 IST|Sakshi
ఈ– చలాన్‌ విధానాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ

మెదక్‌ మున్సిపాలిటీ: ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడేందుకే ఈ–చలాన్‌ ప్రారంభించినట్లు ఎస్పీ చందనాదీప్తి పేర్కొన్నారు. శుక్రవారం మెదక్‌లోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద గల ప్రధాన రహదారి చౌరస్తాలో ఈ–చలాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో శుక్రవారం నుండి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు, ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఈ–చలాన్‌ అనే కొత్త వ్యవస్థ ద్వారా జరిమానాలు విధించనున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రజలను ప్రమాదాల నుండి కాపాడేందుకు, ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు ఈ–చలాన్‌ పద్ధతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ–చలాన్‌ ద్వారా రెండు పద్ధతుల్లో జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు.

కాంటాక్ట్‌ పద్ధతి, రెండోవది ట్రాఫిక్‌ నిబందనలు అతిక్రమించిన వారి ఫొటోలను ట్యాబ్‌లో తీసి ఈ టికెట్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. మూడుసార్లకు మించినట్లయితే ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్, వాహనాన్ని గుర్తించి, వాహనదారుడికి సంబంధించిన ఏదైనా గేట్‌వేస్‌ ద్వారా చెల్లించిన తరువాతే వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ–చలాన్లు చెల్లించని వారికి స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా లీగల్‌ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఆ వాహనదారులు ఫైన్‌ చెల్లించకుంటే కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామన్నారు. ఈ టికెట్‌లో చూపించిన జరిమానాను ఏడు రోజుల్లో మీసేవ, ఈ సేవల ద్వారా చెల్లించాలని చెప్పారు. వాహనదారుడు మూడుసార్లు చెల్లించనట్లయితే 4వ సారి వాహనం సీజ్‌ చేస్తామన్నారు. ట్రాఫిక్‌ అధికంగా ఉండే ప్రాంతాల్లో నాన్‌ కాంటాక్ట్‌ పద్ధతిలోనే ఈ–చలాన్‌ విధించనున్నట్లు చెప్పారు. ఈ–చలాన్‌ ద్వారా విధించిన టికెట్‌ను డైరెక్ట్‌ ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్‌బీ సీఐ మల్లికార్జున్‌రెడ్డి, ఐటీకోర్‌ సీఐ గోవర్ధన్‌గిరి, డీసీఆర్‌బీ సీఐ చందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు