కనీస సామర్థ్యాలకు ‘మూలాల్లోకి వెళ్దాం’! 

3 Jul, 2019 03:00 IST|Sakshi

పాఠశాలల విద్యార్థుల కోసం విద్యాశాఖ కార్యాచరణ

భాషల్లో, గణితంలో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మూలాల్లోకి వెళ్దాం (అటేన్‌మెంట్‌ ఆఫ్‌ బేసిక్‌ కాంపిటెన్సెస్‌ (ఏబీసీ)’ పేరుతో విద్యార్థులకు కనీస అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. బడిబాటలో భాగంగా పాఠశాలల్లో చేరిన 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకున్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అందరికీ ఆయా తరగతుల్లో కొనసాగడానికి మాతృభాష, గణితం, ఇంగ్లిషు భాషల్లో అవసరమైన కనీస సామర్థ్యాలను సాధించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి పాఠశాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అమల్లోకి తెచ్చే లా చర్యలు చేపట్టింది. కనీసంగా 45 రోజుల నుంచి 60 రోజుల వరకు కనీస సామర్థ్యాల సాధనకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పాఠశాల విద్యా కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆందోళన కలిగించే స్థాయిలో.. 
నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌) ప్రకా రం 3, 5, 8 తరగతుల్లో విద్యార్థుల భాషా, గణిత సామర్థ్యాలు ఆందోళన కలిగించేలా ఉన్నట్లు తేలింది. ప్రాథమిక తరగతులు పూర్తయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన చదవడం, రాయడం, లెక్కలు వేయడం వంటి కనీస సామర్థ్యాలు వారిలో ఉండటం లేదని తేలింది. ఈ నేపథ్యంలో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకున్న విద్యార్థులు అందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారంలోనే ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. తద్వారా విద్యార్థులు తెలుగు, ఇంగ్లిషు, తమ మాతృభాషల్లో ధారా ళంగా చదవడం, చదివిన దాన్ని అర్థం చేసుకో వడం, తప్పుల్లేకుండా సొంతంగా రాయడం, గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగాహారం వంటి లెక్కలు చేయడం నేర్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఈ వారంలోనే స్థాయి పరీక్ష..
కనీస సామర్థ్యాలపై విద్యార్థుల స్థాయి తెలుసుకునేందుకు ప్రారంభ పరీక్ష (ప్రీ టెస్టు)ను ఈ వారంలోనే తెలుగు, ఇంగ్లిషు, గణితంలో నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ పరీక్ష ఆధారంగా మాతృభాష, గణితం, ఇంగ్లిషుల లో కనీస సామర్థ్యాలున్న వారిని, లేని వారిని గుర్తించి, తరగతుల వారీగా ఆయా జాబితాలను రూపొందించి ఆన్‌లైన్‌లో పొందుపర్చాల ని సూచించింది. ఆ జాబితాల ఆధారంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీచర్లతో చర్చిం చి కనీస సామర్థ్యాలు లేని వారికి ఏ సమయం లో వాటిని నేర్పించాలని.. ఎవరెవరు ఏయే బా ధ్యతలు తీసుకొని పని చేయాలన్న ప్రణాళికల ను రూపొందించుకొని అమలు చేయాలంది.

మరిన్ని వార్తలు