మున్నిపల్‌ బరిలో నిలిచేవారికి కొత్త నిబంధనలు

6 Jan, 2020 08:24 IST|Sakshi

సాక్షి, కరీనంనగర్‌/రామగుండం: రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలను ప్రకటించింది. కొత్త చట్టం మేరకు కౌన్సిలర్‌గా పోటీ చేసే వ్యక్తికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా పోటీ చేయవచ్చని పేర్కొంది. అభ్యర్థులు నామినేషన్‌కు ముందు రోజు బ్యాంకు ఖాతా తెరిచి ఎన్నికల వ్యయాన్ని దాని ద్వారానే నిర్వహించాలని తెలిపింది. మునిసిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే రూ.1,250, ఇతర కులాలవారు అయితే రూ.2,500 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందని సూచించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు..      

  • వార్డు, డివిజన్‌లో సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి సంబంధిత పురపాలక, నగరపాలక సంస్థల్లో ఓటరుగా నమోదై ఉండాలి.
  • ప్రతిపాదించే వ్యక్తి మాత్రం ఆ వార్డులో ఓటరై ఉండాలి.
  • 21 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అర్హులు.
  • మునిసిపాలిటీలో కాంట్రాక్టర్‌గా ఉండకూడదు.
  • మునిసిపాలిటీ ఆస్తులు లీజుకు తీసుకోకూడదు. బాకీ ఉండొద్దు. 
  • మునిసిపాలిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవులు చేపట్టకూడదు.
  • దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించుకున్న వారు పనికిరారు. 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌ నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులు.
  • గతంలో పోటీ చేసిన ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకు ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించి ఉండరాదు.
  • అనర్హత గడువు ముగియకున్నా పోటీకి అనర్హుడు.
  • నాలుగు కంటే ఎక్కువ సార్లు నామినేషన్‌ వేయకూడదు.
  • ప్రతీ నామినేషన్‌ పత్రంపై సంబంధిత వార్డు నుంచి ఒక ఓటరు ప్రతిపాదకుడిగా సంతకం చేయాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన          డిక్లరేషన్‌ విధిగా జత చేయాలి.
  • నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి రూ.20 స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ నామినేషన్‌ సమయంలో సమర్పించాలి. 
  • ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసినా ఇకదానికి డిపాజిట్‌ చెల్లిస్తే సరిపోతుంది. 
  • పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున మధ్యాహ్నం 3 గంటల లోపు రిటర్నింగ్‌ అధికారికి ‘బి’ ఫాం అందించాలి.
  • ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో పోటీ చేయకూడదు.
  • వేర్వేరు వార్డుల్లో నామినేషన్‌ దాఖలు చేసినా, వార్డులో మినహా ఇతర వార్డుల్లో నామినేషన్‌ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలి.
  • రెండు అంతకంటే ఎక్కువ వార్డుల్లో పోటీలో ఉంటే పోటీకి అనర్హుడిగా ప్రకటిస్తారు.  
మరిన్ని వార్తలు