ఇక ఈవినింగ్‌ ఓపీ సేవలు

18 Mar, 2019 10:14 IST|Sakshi

ఉస్మానియా ఆసుపత్రిలో కసరత్తు

ప్రారంభించిన పాలకవర్గం

త్వరలో ఉద్యోగులతో పాటు

పేద ప్రజలకు అందుబాటులోకి..

సుల్తాన్‌బజార్‌: పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో పేద ప్రజలు, ఉద్యోగులకు ఓపీ సేవలను అందించేందుకు ఉస్మానియా ఆసుపత్రి పాలక వర్గం సిద్ధమవుతోంది. గతంలో ఆసుపత్రిలో ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకుగాను ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ పేరుతో ఈహెచ్‌ఎస్‌ క్లినిక్‌ను ఓపీ బ్లాక్‌లో ఏర్పాటు చేసి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పలు విభాగాల వైద్యులు వైద్య సేవలు అందించేవారు. కాగా ఈ ఈహెచ్‌ఎస్‌ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రి పాలక వర్గం ఈసారి ఉద్యోగులతో పాటు ప్రజలకు కూడా వైద్య సేవలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈవినింగ్‌ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశంఉంది. 

నిత్యం రద్దీ పెరగడంతోనే..
ఉస్మానియా ఆసుపత్రికి నిత్యం రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగులతో పాటు రోగులకు అందుబాటులో ఉండే విధంగా ఈవినింగ్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిత్యం దవాఖానాలోని ఓపీలో నిత్యం సేవలు అందిస్తున్న ఆసుపత్రి పాలక వర్గం.. ఇక ముందు సాయంత్రం సమయాల్లో కూడా వైద్య సేవ అందుబాటులో ఉంటాయి. ఈవినింగ్‌ క్లినిక్‌లో మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్‌ విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటు ఉండి సేవల అందిస్తారు. గతంలో ఈహెచ్‌ఎస్‌ కొనసాగిన గదులలోనే తిరిగి ఈవినింగ్‌ క్లినిక్‌ను ప్రారంభించేందుకు పాలక వర్గం అన్ని విధాలా కసరత్తు చేస్తోంది.

మరిన్ని వార్తలు