జైలులో నయీమ్ అనుచరులకు వసతులు

12 Dec, 2016 15:18 IST|Sakshi
జైలులో నయీమ్ అనుచరులకు వసతులు

వరంగల్ సెంట్రల్ జైలు జైలర్ గోపిరెడ్డి బదిలీ
వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలులో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు పాశం శ్రీనివాస్, సందెల సుధాకర్‌లకు సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా వారికి సెల్ ఫోన్లను జైలర్ గోపిరెడ్డి సమకూర్చినట్లు సిట్ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. దీంతో జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ జైలర్ గోపిరెడ్డిని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నయీమ్ ప్రధాన అనుచరులైన పాశం శ్రీనివాస్, సందెల సుధాకర్‌లను హైదరాబాద్‌లో అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. వీరికి జైలులో విలాసవంతమైన సౌకర్యాలు, సెల్ ఫోన్‌లను అందించేందుకు పాశం శ్రీనివాస్ స్నేహితుడు పులి నాగరాజు జైలర్ గోపిరెడ్డిని కలుసుకున్నారు.

ప్రస్తుతం ఈ జైలులో ఉన్న వీరికి సౌకర్యాలు కల్పిం చేందుకు జైలర్ గోపిరెడ్డి.. నాగరాజుతో రూ.7.50లక్షలకు ఒప్పందం కుదుర్చు కున్నారు. ఈ మేరకు జూలై 15న డబ్బులు ముట్టినట్లు సమాచారం. దీంతో వీరికి ప్రత్యేక సౌకర్యాలు, ఆహార పదార్థాలు, సెల్‌ఫోన్లను సమకూర్చడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎప్పుడు పడితే అప్పుడు శ్రీనివాస్, సుధాకర్‌లను కలిసేందుకు ములాఖత్‌లను గోపిరెడ్డి ఏర్పాటుచేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ ఆరోపణలతో పాటు సెంట్రల్ జైలు నుంచి నవంబర్ 12న శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైలు నుంచి తప్పించుకుపోరుున ఘటనలో గోపిరెడ్డి నిర్లక్ష్యం ఉన్నట్లు విచారణలో తేలింది. నయీమ్‌పై విచారణ జరిపిన సిట్ నివేదిక, సెంట్రల్ జైలులో ఖైదీలు తప్పించుకున్న ఘటనపై జరిగిన విచారణల నివేదికలతో గోపిరెడ్డిని వెంటనే ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీ వికే సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు