మహబూబ్ నగర్ (ఉప్పునుంతల) : అప్పుల బాధతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పునుంతలకు చెందిన రైతు మస్కూరి బాల్చంద్రయ్య (45)కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో గతేడాది ఖరీఫ్లో పత్తిపంటను సాగుచేస్తే తెగుళ్ల కారణంగా పంట ఏమాత్రం చేతికి రాకుండాపోయింది. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు అలాగే పేరుకుపోయింది.
కాగా రబీలో కొంత పొలంలో వేరుశెనగను సాగుచేసినా పెట్టుబడి కూడా రాని పరిస్థితి. దాంతో మళ్లీ రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో అని తలచుకొని మనస్థాపంతో కుమిలిపోయేవాడని భార్య లింగమ్మ తెలిపింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత కుటుంబసభ్యులతోపాటు నిద్రించిన బాల్చంద్రయ్య అర్ధరాత్రి ఇంటి ముందున్న పందిరికి పంచెతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య లింగమ్మతోపాటు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.