మూడేళ్ల చిన్నారిని నరికి చంపిన తండ్రి

20 Mar, 2015 07:12 IST|Sakshi
హత్యకు గురైన చిన్నారి (ఫైల్), పోలీసుల అదుపులో తండ్రి

చర్ల మండలంలో దారుణం
తేగడ(ఖమ్మం): ముక్కుపచ్చలారని మూడేళ్ల కుమారున్ని గొడ్డలితో నరికి హతమార్చాడో తండ్రి. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఈ దురాగతానికి పాల్పడి పారిపోతున్న ఆ కసాయిని గ్రామస్తులు వెంబడించి పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా చర్ల మండలంలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... జిల్లాలోని వైరాకు చెందిన కొమ్మా వసంతరావుతో చర్ల మండలంలోని తేగడకు చెందిన శాంతికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు మరియూ రక్షక్ ఉన్నాడు. వివాహానంతరం రెండేళ్లు వీరు వైరాలోనే ఉన్నారు. వసంతరావుకు అనారోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. శాంతి భర్తను, మూడేళ్ల కుమారుడు మరియూ రక్షక్‌ను తీసుకొని స్వగ్రామం తేగడకు వెళ్లింది. తల్లిగారి ఇంట్లో ఉంటూ కూలీ పనులకు వెళ్తోంది.
 
 భర్తకు వైద్యం చేయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అనారోగ్యంగా ఉన్న వసంతరావు గురువారం ఉదయం భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత శాంతి కుమారున్ని ఇంటి వద్దే ఉంచి బట్టలు ఉతికేందుకు వాగువద్దకు వెళ్లింది. ఆ సమయంలో వసంతరావు కుమారున్ని మంచంమీద నుంచి తీసి కింద పడుకోబెట్టి గొడ్డలితో నరికి పరారవుతుండగా చుట్టుపక్కల వారు వచ్చి అతన్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. చిన్నారిని అల్లారుముద్దుగా పెంచిన తల్లి శాంతి, అమ్మమ్మ వైడూర్యం రక్తపు మడుగులో ఉన్న బాలున్ని చూసి నిశ్చేష్టులయ్యూరు. బాలుడి మేనమామ పాల్‌రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి చర్ల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ వసంత శవపంచనామా నిర్వహించారు.

మరిన్ని వార్తలు