ఎరువు.. బరువు

6 Sep, 2018 12:00 IST|Sakshi

సాక్షి భూపాలపల్లి: ఇప్పటికే విపరీతమైప ఒడిదుడుకుల మధ్య సేద్యం సాగుతోంది. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కుదేలైన అన్నదాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరోవైపు గులాబీ రంగు పురుగు, కత్తెర పురుగు వంటి చీడపీడల ఉధృతికి వ్యవసా యం భారంగా మారుతోంది. దీనికి తోడు ప్రస్తుతం పెరిగి న ఎరువుల ధరలు అన్నదాతకు మరింత భారంగా పరిణమించాయి. ప్రభుత్వం పంపిణీ చేసే యూరియా మినహాయించి మిగతా డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులపై రూ.50 నుంచి 100 వరకు ధరలు పెరిగాయి. రైతుకు ఎకరాకు ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయం రూ.4000లకు మించి వ్యయం అవుతోంది.
 
పెరుగుతున్న పెట్టుబడి వ్యయం
జిల్లాలో రైతుల పరిస్థితి అంత బాగోలేదు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు, కొత్తగా మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు రూపంలో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని అదుపు చేయడానికే రసాయ న మందులను పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి అదనంగా రెండు నుంచి మూడు వేల రూపాలయల ఖర్చు అవుతోం ది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పంటల చేలల్లో వర్షపునీరు నిలవడంతో మొక్కల ఎదుగుదల లోపించింది. వారం రోజులుగా వర్షాలు తెరిపినివ్వడంతో వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు ఎరువులు వేస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం మరో మారు ఎరువుల ధరలు పెరిగాయి. ఐదు నెలల్లో పెరగడం ఇది మూడోసారి. దీంతో వ్య యం కాస్త ఎకరానికి మరో వెయ్యిరూపాయలు పెరగనుంది. మున్ముందు కాలం ఎట్లుంటుందో తెలియదు. దిగుబడి ఏమేరకు వస్తదో.. ధర ఎట్టుంటదో.. ఇప్పుడు మాత్రం పెట్టుబడి ఎక్కువైతాంది.. అంటూ చాలామంది రైతులు వాపోతున్నారు.

అధికమైన ఎరువుల వినియోగం
రెండు వారాల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట పొలాల్లో ఎరువులు చల్లుతూ రైతులు బీజీగా ఉన్నారు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట పండిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆశించిన విధంగా పత్తి, ఇతర పంటల్లో ఎదుగుదల లోపించింది. మొక్కల పెరుగుదల కోసం ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

85,000 మెట్రిక్‌ టన్నుల ఎరువులు
జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం అన్ని పంటకు కలిపి దాదాపు 85,000 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం. ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగుచేస్తుండడంతో రైతులు యూరియా, డీఏపీ, 20–20 ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల్లో డీఏపీ, 20–20 కూడా ఉన్నాయి. డీఏపీ ప్రతి బస్తాపై రూ.180, 20–20 బస్తాపై రూ.100 పెరిగింది. ప్రభుత్వం యూరియా బస్తాను 5 కిలోలు తగ్గించినా ధర రూ.290 దగ్గరే ఉంచింది. డీపీపీ బస్తా ధర మొదట్లో రూ.1081 ఉండగా తాజాగా 1,330కి పెరిగింది. అయితే ఇందులో జింక్, వేప æకలిపిన డీపీపీతోపాటు సాధరణ డీఏపీలను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. దీంతో ఏవి కొనుగోలు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణ డీఏపీ రూ.1,290, కోటెడ్‌ డీఏపీ పేరిట బస్తాకు రూ.40 నుంచి రూ.50 అదనంగా తీసుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు