మాజీ మేయర్‌ సంజయ్‌కు బెయిల్‌   

31 Aug, 2018 15:05 IST|Sakshi
మాజీ మేయర్‌ సంజయ్‌

   షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన జడ్జి

నిజామాబాద్‌ లీగల్‌(నిజామాబాద్‌ అర్బన్‌) : ఇందూరు నగర మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. రూ. 25వేలకు సమానంగా వ్యక్తిగత బాండ్‌ తో పాటు అదే మొత్తంలో ఇద్దరు వ్యక్తుల జమానాత్‌లు సమర్పించాలని ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం ప్రత్యేక జడ్జి జీఎస్‌. రమేష్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జా రీ చేశారు. శాంకరీ కళాశాల విద్యార్థినులపై లైంగి క వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంజయ్‌ను నిజామాబాద్‌ నాల్గోటౌన్‌ పోలీసులు ఈనె ల 12న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్‌కు తరలించింది. 19 రోజుల తర్వా త సంజయ్‌ తరపున్యాయవాదులు ఆకుల రమేష్, కృపాకర్‌రెడ్డి రెండుసార్లు బెయిల్‌ పిటిషన్లు దాఖ లు చేశారు.

కేసు విచారణ దశలో ఉన్నందున జడ్జి పిటిషన్లను తిరస్కరించారు. గురువారం సంజయ్‌ న్యాయవాదులు మరోసారి తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో 16 మంది సాక్షులను విచారించి, వాంగ్మూలాలను సేకరించారని, సీపీసీ సెక్షన్‌ 164 ప్రకారం మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ముందు బాధిత విద్యార్థినులు వాంగ్మూలాలను నమోదు చేశారని బెయిల్‌ ఉత్తర్వులో జడ్జీ పెర్కోన్నారు. సంజయ్‌ నిజామాబాద్‌లోని నాల్గోటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రతి సోమ,గురువారాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరుకావాలని, ఈ కేసులో విచారణాధికారి ఏసీపీ అనుమతి లేకుండా నిజామాబాద్‌ విడిచి పోరాదని, విచారణలో పోలీసులకు సహకరించాలని ఉత్తర్వుల్లో జడ్జి ఆదేశించారు.

సంజయ్‌ విడుదలకు ఆర్డర్‌ కాపీని జిల్లా జైలుకు పంపారు. న్యాయవాదులు ఆకుల రమేష్, కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంజయ్‌ బెయిల్‌ కోసం తమ వాదనలతో జడ్జి ఏకీభవించి బెయిల్‌ మంజూరు చేశారన్నారు. తమ క్లయింట్‌ను జైలు లోపల పెట్టి కేసు విచారణ దశలో ఉందని చెప్పటం వీల్లేదని వాదించామన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, కేసు విచారణలో ఉండగా బెయిల్‌ కోరటం చట్ట సమ్మతమేనన్నారు. 

జైలుకు చేరిన విడుదల ఆర్డర్‌ కాపీ.. 

నగర మాజీ మేయర్‌ సంజయ్‌కు బెయిల్‌ ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ఆయన తరపున న్యాయవాదులు సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల ఆర్డర్‌ కాపీ జైలు అధికారులకు చేరింది. దాంతో జైలు నిబంధనల ప్రకారం సంజయ్‌ను గురువారం విడుదల చేసే అవకాశం లేదని, శుక్రవారం విడుదల చేయవచ్చని తెలిసింది.     
 

మరిన్ని వార్తలు