ఆకలి తీర్చే.. దాతలు

16 Oct, 2019 08:40 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : సేవ చేయాలనే ఆలోచన ఉంటే చాలూ.. జేబులో చిల్లిగవ్వ లేకున్నా కొత్త ఆలోచనతో మిగులు ఆహారాన్ని పేదలకు అందిస్తున్నారు. మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల కడుపు నింపేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సత్యసాయి సేవా సమితి ముందుకొస్తున్నాయి. జానెడు పొట్ట కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంతోమంది ఎండ, వాన, చలీలో కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. మరికొంత మంది వికలాంగులు, వృద్ధులు, అనాధలు, చిన్నారులు యాచకులుగా మారుతున్నారు. అలాంటి వారికి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సేవా సమితి సభ్యులు కడుపునిండా భోజనం పెడుతున్నారు. దీంతోపాటు శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని వృథాగా పోనివ్వకుండా అక్కడి నుంచి కార్మికవాడల్లో, రైల్వేస్టేషన్, రిమ్స్‌ ఆస్పత్రిలో ఆకలితో ఉన్నవారికి భోజనం వడ్డిస్తున్నారు. కడుపునిండా తిన్నవారు అన్నదాత సుఖీభవ అంటూ వారిని ఆశీర్వదిస్తున్నారు.

మానవ సేవే మాధవ సేవ..
మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సంఘం సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓ శుభకార్యానికి వెళ్లిన సమయంలో మిగిలిపోయిన ఆహారాన్ని పారవేసే సమయంలో ఈ సంఘం సభ్యులకు ఓ ఆలోచన తట్టింది. మిగులు ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్న పేదలకు వడ్డిస్తే కడుపునిండా భోజనం చేస్తారని.. ఇలా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. పెండ్లీలు, బర్త్‌డే పార్టీలు, చిన్నచిన్న శుభకార్యాల్లో మిగిలిపోయిన అన్నం కార్మిక వాడల్లోకి తీసుకెళ్లి వారికి భోజనం వడ్డిస్తున్నారు. ఈ సంఘంలో బాధ్యులు పస్పుల రాజు, శివగణేష్, దేవిదాస్, రామకృష్ణ, ప్రశాంత్, సంతోష్, అభికృత్, కనక నర్సింగ్, శశికళ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. శుభకార్యాల్లో మిగిలిపోయిన అన్నం వృధా కాకుండా సేవ సమితి సెల్‌: 7382747696 లపై సంప్రదించవచ్చు.

రోగుల బంధువులకు అండగా..
జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రం రోజుకు ఎంతో మందికి కడుపునిండా ఉచితంగా ఒకపూట భోజనం పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగలేని పేద ప్రజలే నిత్యం రిమ్స్‌కు చికిత్స కోసం వస్తుంటారు. అలాంటి వారు భోజనం చేయలేని పరిస్థితుల్లో వారికి కడుపునిండా భోజనం అందిస్తున్నారు. 2012 ఆగస్టు 21న శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. అన్నదానం చేయాలనుకునేవారు సెల్‌: 9440871776, 9705692816 సంప్రదించాలి. 

ఆరోగ్యానికి జొన్నరొట్టె


మంచిర్యాల :
రోజురోజుకు ప్రాచీన వంటకాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యాన్ని వ్యాధుల నుంచి  కాపాడు కోవడానికి పలు రకాల ప్రాచీన వంటకాలను భుజిస్తున్నారు. ప్రాచీన వంటకాల్లో జొన్నరొట్టెలకు పట్టణంలో బలే గిరాకి పెరిగింది. జొన్నరొట్టె వలన శారీరానికి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందని ప్రజలు ఇష్టంగా  కొనుగోలు చేస్తున్నారు. ఒక్క దుకాణంతో మొదలైన జొన్నరొట్టె వ్యాపారం పన్నెండు దుకాణాలుగా వెలిసాయి. ఒక్క రొట్టెకు పది రూపాయల చొప్పున అమ్మతున్నారు. నిత్యం చాల మంది జొన్నరొట్టెల కోసం ఆసక్తిని చూపుతున్నారు.

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు నిత్యం జొన్నరొట్టెలు తింటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. కొంతమంది మహిళలు నిత్యం మధ్యాహ్నం వచ్చి జొన్నపిండి కలుపుకుని కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తు వేడివేడిగా కారం చెట్నితో ప్రజలకు అందిస్తు జీవనోపాధిని పొందుతున్నారు. జొన్నరొట్టెలతో ఆర్యోగానికి కలిగే మేలా చాల ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. దీంతో పట్టణంలో ప్రాచీన వంటకం జొన్నరొట్టెకు భలే గిరాకీ పెరిగింది.

మరిన్ని వార్తలు