గిన్నిస్‌ బుక్‌లో ‘గాంధీ ఆస్పత్రి’

2 Feb, 2019 02:58 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ వైద్య ప్రదాయిని సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి చరిత్రలో మరో మైలురాయి అధిగమించింది. గంట వ్యవధిలో అత్యధిక బీపీ పరీక్షలు నిర్వహించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఆస్పత్రి సెమినార్‌ హాలులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ రాజారావు, వైద్యులు వినయ్‌శేఖర్, ఆర్‌ఎంవోలు జయకృష్ణ, శేషాద్రి, సత్యరత్న ఈ వివరాలను వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్‌ 24వ తేదీన గాంధీ ఆస్పత్రిలో గంట వ్యవధిలో 11,416 మందికి బ్లడ్‌ప్రెషర్‌ (బీపీ) రీడింగ్‌లు నమోదు చేశారు. దేశంలోని 37 కేంద్రాల్లో ఏకకాలంలో ఈ ప్రక్రియ కొనసాగగా, అత్యధికంగా బీపీ పరీక్షలు నిర్వహించి గాంధీ ఆస్పత్రి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుందని వారు వివరించారు. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ నుంచి శుక్రవారం అధికారికంగా సర్టిఫికెట్‌ అందిందని తెలిపారు. 

మరిన్ని వార్తలు