విజన్‌తో ముందుకు వెళ్దాం..

16 Aug, 2014 03:19 IST|Sakshi

నిజామాబాద్‌కల్చరల్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జిల్లా  అభివృద్ధే ధ్యేయంగా  విజన్‌తో ముందుకుసాగుదామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ పిలుపునిచ్చారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డులో గల హరిత ఇందూర్ ఇన్ సమావేశపు హాల్‌లో శుక్రవారం రాత్రి జిల్లా అధికార యంత్రాంగం తరపున జిల్లా అధికారులకు, మీడియా ప్రతినిధులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.   తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో,ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారన్నారు.

 అందుకుగాను మన జిల్లాను కూడా ఆయన ఆశయాలకనుగుణం గా అన్నిరంగాల్లో అభివృద్థిపథంలో తీసుకువెళ్లేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.  ఈ సందర్భంగా  నలుగురు స్వాతం త్య్ర సమరయోధుల సతీ మణులు లక్ష్మీబాయి, పార్వతిబాయి, లక్ష్మీనర్సవ్వ, సర స్వతిలకు కలెక్టర్ శాలువకప్పి ఘనంగా సన్మానిం చారు. అనంతరం ఆష్ట గంగాధర్ కళా బృందం నృత్యప్రదర్శనలు, దేశభక్తి,జానపద గేయాలు అలరించగా, అంతర్జాతీయ ఇంద్రజాలికుడు రంగనాథ్ ప్రదర్శన అబ్బురపరిచింది.

ఉత్తమ సేవలందించిన పలువురికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉదయం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ప్రదర్శించిన 15 వివిధ శాఖల శకటాలకుగాను వ్యవసాయ శాఖకు ప్రథమ, గ్రామీణ నీటి పారుదల శాఖకు ద్వితీయ, రాజీవ్ విద్యామిషన్‌కు తృతీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి, జిల్లా జడ్జి షమీమ్ అక్తర్, ఆయా శాఖల జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు