‘జీవీసీ’ తరలిపోనుందా..!

12 Oct, 2014 03:32 IST|Sakshi

బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను అర్ధ శతాబ్ద కాలంగా కంటికి రెప్పల కాపాడిన గోదావరి వ్యాలీ సర్కిల్ కార్యాలయం (జీవీసీ-1) తరలిస్తున్నట్లు ప్రాజెక్ట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీపావళి తర్వాత ముహూర్తం కుది రినట్లు సమాచారం. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరి ధిలో ప్రస్తుతం పనులు అంతగా లేవన్న సాకుతో సర్కిల్ కార్యాలయాన్ని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కోసం మెదక్ లేదా రంగారెడ్డి జిల్లాకు ఆనుకుని ఉన్న సంగారెడ్డికి తరలించాలనే ఆలోచన అధికారులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నెల 17న జరిగే చీఫ్ ఇంజినీర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. జీవీసీ-1 సర్కిల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఉన్నాయి.

డివిజన్-1 కాకతీయ కాలువ పనులను 0 కిలో మీటర్ నుంచి జగిత్యాల్ వరకు చూస్తుంది. డివిజన్ -2 డ్యాం, క్యాంప్, ప్రాజెక్ట్ వరద గేట్ల పనులను, డివిజన్-3 జగిత్యాల్ నుంచి కరీంనగర్ వరకు కాకతీయ కాలువ పనులను, డివిజన్-4 కడెం ప్రాజెక్ట్, ముంపు బాధితుల నిధులను గురించి పరిశీలిస్తుంది.  మెట్‌పల్లిలో డివిజన్-1,  జగిత్యాల్‌లో డివిజన్-3 కార్యాలయాలు ఉన్నాయి. మిగత రెండు డివిజన్లు ఎస్సారెస్పీలో ఉన్నాయి. ప్రాజెక్ట్ నుంచి  డివి జన్-5 ఇది వరకే ప్రాణహిత చేవేళ్ల కోసం బోధన్ తరలించారు.

ప్రాజెక్ట్ పరిధిలో డివిజన్-2 ఉంచి దానికి డివిజన్-4లోని కొన్ని సబ్ డివిజన్లను అటాచ్ చేసి జీవీసీ -1ను తరలించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వం పాలకులు, అధికారుల వహించిన నిర్లక్ష్యం మూల్యమే ప్రస్తుతం పరిస్థితికి కారణమని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలోనే పెద్ద ప్రాజెక్ట్‌గా పేరు ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు సర్కిల్ కార్యాలయం లేకుండ ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు అంటున్నారు. జీవీసీ-1 ప్రాజెక్ట్ నుంచి తరిలిపోతే ప్రాజెక్ట్ కళ తప్పడం ఖాయమని, సంగారెడ్డి, మెదక్ రెండు ప్రాంతాల్లో ప్రాణాహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కోసం సర్కిల్ ఏర్పాటు ఆవశ్యకత ఉండటం వలన ప్రాజెక్ట్ నుంచి సర్కిల్ తరలించే ప్రమాదం ఏర్పాడుతుందని ప్రాజెక్ట్ కార్యలయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

మరిన్ని వార్తలు