సర్వే పేరుతో ఇంట్లోకి వచ్చి.!

23 Sep, 2017 18:20 IST|Sakshi

కరీంనగర్‌: సర్వే చేస్తున్నామంటూ ఇంట్లోకి వచ్చిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లింది. ఈ సంఘటన ముస్తాబాద్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కస్తూరి వెంకటరత్నమ్మ(60) ఇంటికి ఈ రోజు మధ్యాహ్నం ఓ మహిళ సర్వే చేస్తున్నామంటూ వచ్చింది. ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డ్‌, ఫోన్‌ నెంబర్‌ వివరాలు తీసుకుంది.

ఈ క్రమంలో వృద్ధురాలు ఒంటరిగా ఉంటోందని గమనించి ఆమె కళ్లలో కారం కొట్టి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెనుగులాట జరగడంతో కింద పడ్డ వెంకటరత్నమ్మ గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న పక్కింటి స్వరూప మహిళా దొంగను అడ్డుకోవడానికి యత్నించగా.. ఆమె పై దాడి చేసి అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు